English | Telugu
ఆర్బీఐ తీరుపై సుప్రీంకోర్టు అసహనం.. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థికాంశాలు ముఖ్యమా?
Updated : Jun 4, 2020
మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ చేయాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టులో ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఒకవేళ మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులు రూ.2 లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తుందని ధర్మాసనానికి నివేదించింది. ఈ అంశంపై ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసేముందు మీడియా సంస్థలకు లీక్ చేయడం పట్ల సుప్రీంకోర్టు మండిపడినట్టు సమాచారం. ‘మీడియాకు లీకులు ఇస్తూ ఈ అంశాన్ని మరింత సంచలనం చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది.’అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఓ వైపు మారటోరియంకు అనుమతిస్తూనే మరోవైపు వడ్డీపై ఎలాంటి ఉపశమనం లేకుండా చేయడం మరింత ప్రమాదకరం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితిని తాము అర్ధం చేసుకుంటాం.. కానీ, ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే ముఖ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ, ఆర్బీఐ వివరణ కోరుతూ.. తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.