English | Telugu

ప్రధాని మోడీ కార్యాలయాన్ని అమ్ముతున్నట్టు ఓఎల్ఎక్స్ లో ప్రకటన

ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వారణాసిలోని గురుధామ్ కాలనీలో మోడీ కార్యాలయం ఉంది. అయితే, ఈ కార్యాలయాన్ని నలుగురు ప్రబుద్ధులు ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టేశారు. మోడీ కార్యాలయం వివరాలు, ఫొటోలను ప్రచురిస్తూ.. దీనిని రూ.7.5 కోట్లకు అమ్ముతామని ప్రకటనలో తెలిపారు. 6,500 చదరపు అడుగులు గల ఈ విల్లాలో 4 గదులు, 4 బాత్రూములు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈశాన్య ముఖద్వారంతో విల్లా ఉందని, కారు పార్కింగ్ కూడా ఉందని ప్రకటనలో తెలిపారు.

మోడీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్ఎక్స్‌లో ప్రకటన వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు రావడంతో స్థానిక పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఓఎల్ఎక్స్ లో ఆ ప్రకటనను తొలగింపజేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీకాంత్ ఓఝా అనే వ్యక్తి ఈ ప్రకటనను ఇచ్చాడని గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.