దేశమంతా కరోనా, చైనా గోలలో ఉంటే.. చమురు సంస్థలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే పనిలో ఉన్నాయి. వరుసగా 13వ రోజు కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈరోజు లీటర్ పెట్రోల్ పై 56 పైసలు, లీటర్ డీజిల్ పై 63 పైసలను చమురు సంస్థలు పెంచేశాయి. 13 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ.7.11, లీటర్ డీజిల్ పై రూ.7.67 పెరగడం గమనార్హం. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.37, లీటర్ డీజిల్ ధర రూ.77.06కు చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోలు ధర రూ.81.36, డీజిల్ ధర రూ.75.31 గా ఉన్నాయి. మార్చిలో పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం రూ. 10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ విధించింది. దీంతో చమురు సంస్థలు ఈ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులూ పైసా కూడా పెంచకుండా ఉన్న చమురు సంస్థలు.. ఇప్పుడు వరుసగా పెంచుకుంటూ పోతూ వినియోగ దారుల జేబులకి చిల్లు పెడుతున్నాయి. సాధారణ సమయంలో అయితే ఈ స్థాయిలో ధరలు పెరిగితే నిరసనలు వెల్లువెత్తుతాయి. కరోనా కాలం కావడంతో జనాలు సీరియస్ గా తీసుకోవడం లేదు. చమురు సంస్థలు కూడా ఇదే అదనుగా భావించి ధరలు పెంచుతున్నాయి.