English | Telugu

పరిటాల రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు! వైసీపీ ఎంపీకి సునీత స్ట్రాంగ్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, దివంగత పరిటాల రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విరుచుకుపడ్డారు పరిటాల సునీత. రవి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ చరిత్ర ఏమిటో మాకు తెలుసని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ మాదిరి రోడ్డెక్కి మాట్లాడి, విలువను తగ్గించుకోలేమని చెప్పారు. ఇంకోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని సునిత వార్నింగ్ ఇచ్చారు. రవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఎస్సీలు, ఎస్టీలు సంతోషంగా ఉన్నారన్నారు పరిటాల సునిత.

దివంగత నేత పరిటాల రవిని ఉద్దేశించి బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. పరిటాల రవి ఫ్యాక్షనిజం, నక్సలిజం పేరుతో ఎంతోమంది తలలను నరికారని ఆయన కామెంట్ చేశారు. చంద్రబాబు అండతో రవి దుర్మార్గాలు చేశారని మాధవ్ ఆరోపించారు. రాప్తాడు ప్రాంతంలోని పొలాలు నీళ్లు లేక ఎండిపోతుంటే... రవి ఆ పొలాలను రక్తంతో తడిపారన్నారు వైసీపీ ఎంపీ. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అనంతపురం జిల్లాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు.