English | Telugu

ఈరోజు నుంచి అమ‌లులోకి వ‌చ్చిన లాక్‌డౌన్ మినహాయింపులు!

సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతున్న నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌క‌టించిన సడలింపులు ఈ రోజు నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి. కరోనా ప్రభావం తీవ్రంగాలేని ప్రాంతాల్లో, ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమలయ్యేలా పలు మినహాయింపులు ఇచ్చింది.

1. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలైయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ దాని అనుబంధ రంగాలు... మార్కెటింగ్‌, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభానికి కేంద్రం అనుమతించింది. వీటితోపాటు మునిసిపల్‌ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు అనుమ‌తించారు.

2. దేశంలోని 377 జిల్లాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పనులకు వెసులుబాటు ఇచ్చారు. అన్ని వస్తువుల సరఫరాకు ఈ-కామర్స్‌ సంస్థలకు ఇటీవల మినహాయింపునిచ్చిన కేంద్రం, ఆదివారం ఈ అనుమతులను రద్దు చేసింది. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా అత్యవసర కాని వస్తువుల సరఫరా కు అనుమ‌తించ‌లేదు. అవసరమైన వాటికి మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

3. కేంద్రం మినహాయింపులు ఇచ్చినా తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా లాంటి రాష్ట్రాలు మాత్రం లాక్‌డౌన్ ఆంక్షల్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. కార్యకలాపాలు పునః ప్రారంభించే సమయంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండరాదని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. వెసులుబాట్లు ఇచ్చిన ప్రాంతాల్లో ఇప్పుడున్న పరిస్థితిని యతాతథంగా కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నించాలని సూచించింది. అవసరమని భావిస్తే కేంద్రం విధించిన ఆంక్షలకు అదనంగా మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకోవచ్చని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే బాగా తెలుస్తాయి కాబట్టి అదనపు జాగ్రత్తలు, చర్యలు తీసుకొనే అధికారం వాటికే వదిలిపెట్టింది.

4. నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దు.
5. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదు.
6. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు మూసివేస్తారు.
7. సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం.
8. మతప్రదేశాలలో పెద్ద ఎత్తున ప్రార్థనలపై నిషేధం.
9. ట్యాక్సీ సర్వీసులకు అనుమతి లేదు.
10. హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిలేదు. హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవు.
11. ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలు యధాతథంగా సాగుతాయి. ఔషధ పరిశ్రమలలో ఉత్పత్తికి అనుమతులు.
12. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలు. వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలు ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలకు అనుమ‌తి.
13. బ్యాంకు కార్యకలాపాలకు అలాగే, వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవు.
14. ఉపాధి హామీ పనులు, భవన నిర్మాణ పనులు.. సమీపంలో ఉన్నవారితోనే పనులు చేపట్టాలి. ఉపాధి కూలీలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి.
15.ఎరువులు, పురుగుల మందులు, విత్తనోత్పత్తి దుకాణాలు తెరుచుకుంటాయి.
16. పాల ఉత్పత్తులు, వ్యాపారాలు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగుకు అనుమ‌తి.
17. జాతీయ రహదారులు పక్కన దాబాలు, వాహన మరమ్మత్తుల దుకాణాలకు కేంద్రం అనుమతించింది.
18. ఐటీ సంస్థల్లో 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతి.
19. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం.
20. వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి.
21. ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి
22. రక్షణ, పారామిలటరీ, ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ, విపత్తు నిర్వహణ, ఎన్ఐ‌సీ, ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, యువ కేంద్రాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.
23. మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల్లోని డిప్యూటీ సెక్రెటరీలు అంతకంటే ఎక్కువస్థాయి అధికారులు 100 శాతం హాజరుకావాలి.. మిగతా అధికారులు, ఇతర సిబ్బంది 33 శాతం వరకూ ఆఫీసులకు హాజరుకావాలి.
24. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం సహా గుట్కాలు, ఖైనీ, మద్యపానం నిషేధం. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే శిక్షార్హులవుతారు.
25. పనులు ప్రారంభించే భారీ పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక సముదాయాల ప్రాంగణాల్లోనే కార్మికులకు వసతి సౌకర్యాలు కల్పించ‌డానికి అనుమ‌తి.
26. గుట్కా, పాన్‌ మసాలాలు, నమిలే పొగాకు, సిగరెట్ల అమ్మకాలను మే 3వ తేదీ వరకు పూర్తిస్థాయిలో నిషేధం అమలవుతుంది.
27. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే వారంతా మాస్క్‌లు ధరించాల్సిందే. ఇందులో మినహాయింపు లేదు. పనిచేసేందుకు అనుమతించిన ప్రాంతాల్లోనూ మాస్కులు, శానిటైజర్‌ల వినియోగించాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రాలు తప్పనిసరి.
28. ప్రజా రవాణాకు అవకాశం లేదు. కారులో ఇద్దరు, బైక్‌పై ఒక్కరే!
జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు బంద్‌.
29. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్‌ సంస్థలను మూసివేయాల్సిందే.
30.దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నీ బంద్‌. రైళ్లు, మెట్రో, ప్రజారవాణాకు సంబంధించిన బస్సులు తిరగవు.