English | Telugu

మళ్లీ లాక్‌డౌన్‌.. కరోనా కట్టడికి  సరైన మార్గం

పంజా విసురుతూ లక్షలాది మందికి సోకుతున్న కోవిద్ 19 వైరస్ ను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ సరైన మార్గమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మూడురోజుల్లోనే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్ష కు పైగా పెరగడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య తొమ్మది లక్షలు దాటింది. అనేక రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ప్రజలు స్వచ్చందగా షాపులను మూసేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కరోనా సోకిన వారు ఉంటే సెలవు ఇస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో లాక్ డౌన్ పాటిస్తున్నారు. తెలంగాణలోనూ ముఖ్యంగా హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి రోజూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో లాక్ డౌన్ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాల్లోనే లాక్ డౌన్ విధించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నా లాక్ డౌన్ ఎందుకు విధించడం లేదు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వైద్యపరీక్షలు నిర్వహించి పాజిటివ్ వ్యక్తులను ట్రేస్ చేయడం, వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం ముఖ్యం. దాంతోపాటు వ్యాప్తిని నియంత్రించాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అని చాలా దేశాల్లో నెలకొన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల నగరంలో పర్యటించిన కేంద్రబృందం సూచనల మేరకు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో హైదరాబాద్‌లో తిరిగి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా కేసులు అధికంగా ఉన్నపాత బస్తీలోని కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని క్లస్టర్ జోన్‌గా గుర్తించి రాకపోకలు నిలిపేస్తారు.