English | Telugu

ఏపీలో ఆ మూడు జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్

ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతుండటంతో ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటించారు అధికారులు. అనంతపురం జిల్లాలోని 8 మండలాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచి వారం రోజుల పాటు అనంతపురం జిల్లా కేంద్రం సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్‌డౌన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక‌, ప్రకాశం జిల్లాలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న ఒంగోలు, చీరాలలో ఆదివారం నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్‌ ‌ప్ర‌క‌టించారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పలాసలోనూ అధికారులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. పలాసకు చెందిన ఒకరి సంస్మరణ కార్యక్రమం ఈ నెల 11న జరిగింది. ఇక్క‌డ దాదాపు 200 మందికి భోజనాలు పెట్ట‌గా.. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన బంధువుకు ఆ త‌ర్వాత క‌రోనా సోకినట్లు తేలింది. అంతేకాదు.. ఆ కార్యక్రమానికి హాజరైన ఓ వ్యాపారికి కూడా క‌రోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు.. పలాస, కాశీబుగ్గలను తొలుత కట్టడి ప్రాంతాలుగా గుర్తించారు. సంస్మరణ కార్యక్రమానికి ఎక్కువమంది హాజరైనందున నియోజకవర్గ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నివాస్‌ ప్రకటించారు.