English | Telugu

రూ.50 వేల కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

వలస కార్మికులకు వారి స్వస్థలాల్లోనే ఉపాధిని కల్పించేందుకు ఉద్దేశించిన ‘గరీబ్ కళ్యాణ్ రోజ్ ‌గార్ యోజన’ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్‌ లోని ఖగారియా జిల్లాలో ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచడమే ఈ పథకం లక్ష్యమన్న మోడీ.. ఇందుకోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక, ఎన్నో అవస్థలు పడుతూ స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికుల అవస్థలు తనను కదిలించాయని, వారి కోసమే ఈ పథకమని మోడీ వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకూ పట్టణాల పురోగతి కోసం పాటు పడిన వలస కార్మికులు.. ఇక నుంచి తమ ప్రాంతాన్ని ప్రగతి పథంలో నిలపాలని మోడీ ఆకాంక్షించారు. పల్లె ప్రాంతాల్లో నివసిస్తోన్న శ్రామికులైన మన సోదర సోదరీమణులకు ఈ పథకాన్ని అంకితం చేస్తున్నానని మోడీ తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల ద్వారా మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించామని, ఇందుకు రూ. 50 వేల కోట్లను ఖర్చు చేస్తామని మోడీ వెల్లడించారు. ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాలో ఈ పథకం అమలవుతుందన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలలో వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు. వీరికి ప్రయోజనం చేకూర్చేలా ‘గరీబ్ కళ్యాణ్ రోజ్ ‌గార్ యోజన’ ఉంటుంది.