English | Telugu

సీఎం కేసీఆర్ అమెరికాకి వెళ్లారంటూ కాసులు వెనకేసుకున్న అధికారులు!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కి తెలియకుండా.. కొందరు అధికారులు కాసులకి కక్కుర్తి పడి.. సీక్రెట్ జీవోలు ఇస్తున్నారా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. పీఎం, సీఎం లు విదేశీ పర్యటనలకు వెళ్లడం సహజం. అయితే ఇతర రాష్ట్రాల సీఎంలతో పోల్చుకుంటే.. కేసీఆర్ విదేశీ పర్యటనలకు వెళ్లడం తక్కువనే చెప్పాలి. అసలు చేసేదే తక్కువ పర్యటనలు అంటే.. ఆ తక్కువలో కూడా అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడం చర్చనీయాంశమైంది.

కేసీఆర్‌ 2014 జూన్‌ 2 నుంచి 2020 ఫిబ్రవరి 15 వరకు ఏయే విదేశీ పర్యటనలు చేశారు? ఒక్కో పర్యటనకు ఎంత ఖర్చయింది? వంటి అంశాలపై వివరాలు తెలపాల్సిందిగా జలగం సుధీర్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఫిబ్రవరి 27న సమాధానం ఇచ్చింది. ఈ ఆరేళ్లలో కేసీఆర్‌ మూడు విదేశీ పర్యటనలు చేసినట్లు తెలిపింది. 2014 ఆగస్టులో సింగపూర్‌-మలేషియాలకు, 2015 సెప్టెంబర్‌లో చైనాకు కేసీఆర్‌ వెళ్లినట్లు తెలిపింది. అలాగే, 2016 ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకు కేసీఆర్‌ అమెరికా పర్యటనలో ఉన్నట్లు పేర్కొంది. కానీ ఇక్కడే పప్పులో కాలేసింది.

2016 ఆగస్టు 30వ తేదీ నాడు కేసీఆర్‌.. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో నాటి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. రెండ్రోజుల తర్వాత అనగా సెప్టెంబరు 1వ తేదీన అప్పటి అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం హైదరాబాద్‌లోని క్యాంప్‌ ఆఫీసుకు వచ్చి కేసీఆర్‌ను కలుసుకున్నారు. అంటే ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకూ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోనే ఉన్నారు. కానీ జీఏడీ మాత్రం.. ఆ మూడు రోజులూ కేసీఆర్‌ దేశంలోనే లేరని, అమెరికా పర్యటనలో ఉన్నారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అమెరికాలో 2016 ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకూ జరిగే ఓ వ్యవసాయ సదస్సుకు రావాల్సిందిగా ఆ ఏడాది జులైలో కేసీఆర్ కు ఆహ్వానం అందింది. కానీ కేసీఆర్‌ ఎందుకో ఆ పర్యటనకు వెళ్లలేదు. అయితే, జీఏడీ మాత్రం.. కేసీఆర్‌ అమెరికా పర్యటనకు సంబంధించి 2016 ఆగస్టు 26న జీవో ఆర్టీ నంబర్‌ 1895 జారీ అయినట్లు ప్రకటించింది. అసలు కేసీఆర్ అమెరికానే వెళ్లునప్పుడు.. ఈ జీవో ఎలా జారీ అయింది? ఈ జీవో విషయం సీఎంకు తెలియదా? ఆయనకు తెలియకుండా సీఎం పర్యటన పేరుతో కాసులు వెనకేసుంటున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అయితే సీఎం విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చులను మాత్రం జీఏడీ వెల్లడించలేదు. మొదటి రెండు పర్యటనల ఖర్చు వివరాలు పరిశ్రమల శాఖ వద్ద, అమెరికా పర్యటన ఖర్చు వివరాలు వ్యవసాయ శాఖ వద్ద ఉన్నాయని పేర్కొంది. సరే మొదటి రెండు పర్యటనలు అంటే నిజంగా సీఎం వెళ్లారు కాబట్టి దానికి తగ్గట్టు ఖర్చు చేసి ఉంటారులే అనుకోవచ్చు. కానీ, అసలు వెళ్లని అమెరికా పర్యటన ఖర్చు వివరాలు వ్యవసాయ శాఖ వద్ద ఉండటం ఏంటి? దీనిపై కేసీఆర్ సర్కార్ కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టాల్సిన అవసరముంది. సమాచార హక్కు చట్టం పుణ్యమా అని ఈ భాగోతం బయటపడింది. ఇంకా బయటకు రాని భాగోతాలు ఎన్ని ఉన్నాయో ఏంటో!!