English | Telugu

జ‌గ‌న్ బాధితుల‌కు షా ఆశ్ర‌యం!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద చాడీలు విన‌డానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఉన్న‌తాధికారులు ఎవ‌రైనా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాధితులుంటే వారికి ఉన్న‌త ప‌ద‌వులు ద‌క్క‌డం ఖ‌యం. అయితే అమిత్ షాకు జ‌‌గ‌న్ బాధితుడ‌నే న‌మ్మ‌కం కుద‌రాలి అంతే.

ఈ లెక్క‌లోనే జాస్తి కృష్ణకిషోర్ కూడా వ‌స్తారు. జగన్ వద్దన్న జాస్తి కృష్ణకిషోర్ కు కేంద్రం ఆయ‌న్ను ఆదాయపు పన్ను శాఖ ఛీఫ్ కమిషనర్ పదవి నుంచి ప్రిన్సిపల్ ఛీఫ్ కమిషనర్ గా నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

అస‌లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఎందుకు ఇరిటేష‌న్ వుంది. దానికి పెద్ద కార‌ణం వుంద‌ని గ‌తంలోనూ వార్త‌లొచ్చాయి. అమిత్‌షా ఇగోను జ‌గ‌న్ హ‌ర్ట్ చేశార‌ట‌. అది ఎలా అంటే...

అప్ప‌ట్లో సీబీఐలో ఉన్న‌తాధికారులు ప‌ర‌స్ప‌రం కేసులు పెట్టుకొని బ‌జార్న ప‌డ్డారు. ఆ పంచాయితీలో మ‌నీష్ కుమార్ సిన్హా అనే ఐపీఎస్ అధికారి కేంద్ర బిందువుగా మారి కోర్టుకు ఓ కీల‌క లేఖ స‌మ‌ర్పించారు. ఆ తరువాత సుప్రీం ఉత్త‌ర్వుల‌తో అమిత్‌షా త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన ఆస్తానా ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింద‌ట‌. కార‌ణం ఏమంటే మ‌నీష్ కుమార్ సిన్హా. అందుకే ఆ అధికారి అంటే అమిత్ షాకు ఇప్ప‌ట్టికీ అయిష్టమే కాదు కోపం.

ఆ అధికారి కేంద్రం నుంచి ఏపీ స‌ర్వీసుకు తిరిగి రాగానే జ‌గ‌న్ ఏకంగా ఇంట‌లిజెన్స్ ఛీఫ్ ప‌ద‌వినిచ్చారు. అదీ అమిత్‌షాకు న‌చ్చ‌లేద‌ట‌. అధికారి మీద వున్నకోపం ఇప్ప‌డు జ‌గ‌న్ మీద ఇలా ఎఫెక్ట్ చూపుతుంది. ఓ ద‌శ‌లో జ‌గ‌న్‌కు అమిత్‌షా ఈ కార‌ణంతోనే అపాయింట్మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ట‌.

అందుకే జ‌గ‌న్ కోరుకున్న డిప్యూటీష‌న్లేమీ ముందుకు క‌ద‌ల‌డం లేదు. పైగా జ‌గ‌న్ లూప్ లైన్‌లో పెట్టిన అధికారుల‌కు అమిత్‌షా భ‌రోసా ద‌క్కుతుంది. మంచి పోస్టులు కూడా ద‌క్కుతున్నా‌యి. జ‌గ‌న్‌కు అస‌లు అర్థం కాని కేర‌క్ట‌ర్ ఏమైనా ఉందీ అంటే అది అమిత్‌షా! అమిత్‌షా ఎప్పుడూ ఓ క‌న్నేసి ఉంటే కేర‌క్ట‌ర్ ఎవ‌రంటే జ‌గ‌న్‌.

తెలంగాణ ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ శ్రీలక్ష్మి.. వీరిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు డెప్యుటేషన్‌పై తీసుకురావాలని, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చాలాకాలం నుంచీ ప్రయత్నిస్తోంది. స్టీఫెన్ రవీంద్రను నిఘా దళపతి చేయాలన్నది జగన్మోహన్‌రెడ్డి కోరిక. గతంలో ఆయనకు రాష్ట్రంలో పనిచేసిన అనుభవం ఉండటం, ముక్కుసూటి అధికారి కావడమే దానికి కారణం.దానికోసం జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు చెవినిల్లుకట్టుకుని చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ అవి అమిత్‌షాకు వినిపించడం లేదు.

జగన్ అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయి జైలుశిక్ష కూడా అనుభవించిన శ్రీలక్ష్మి మాత్రం పట్టువదలని విక్రమార్కిణి మాదిరిగా, ఢిల్లీలో ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఆమె హైదరాబాద్‌లో కంటే ఢిల్లీ ఏపీభవన్, తెలంగాణభవన్‌లోనే దర్శనమిస్తుంటారు. ఆమెను ఎలాగైనా ఏపీకి తీసుకురావాలని ఎంపి విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. ఆమెను వెంటపెట్టుకుని హోంమంత్రి, పీఎంఓ కార్యాలయాలకు తీసుకువెళ్లిన ఫొటోలు మీడియాలో కూడా వచ్చాయి. కానీ డిఓపీటీ మాత్రం, వారిద్దరినీ ఏపీకి పంపించేందుకు ఇప్పటివరకూ సుముఖత చూపలేదు.

వారిని ఏపీకి పంపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధంగానే ఉన్నప్పటికీ, కేంద్రం మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదు. జగన్మోహన్‌రెడ్డితో కావలసిన కార్యాలు సాగిస్తున్నప్పటికీ, మోదీ సర్కారు ఈ విషయంలో మాత్రం ‘ఆ ఒక్కటీ తప్ప’ అని మెలికపెడుతోంది.

దాదాపు ఏడాది నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడల్లా స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మితోపాటు కొత్తగా.. కర్నాటకు చెందిన మరో అధికారి శ్రీవత్సను తీసుకురావాలని కోరుతున్న జగన్మోహన్‌రెడ్డికి, ఢిల్లీలో ఎందుకో వర్కవుట్ కావడం లేదు. కాగల కార్యం నెరవేర్చే గంధర్వుడు ఉన్నా ఎందుకో జగన్మోహన్‌రెడ్డి కోరిక మాత్రం కోరికగానే ఉండిపోయింది. కర్నాటక క్యాడర్‌కు చెందిన శ్రీవత్సను తీసుకువచ్చి, ఆయనకు టీటీడీ ఈఓ పదవి ఇవ్వాలన్న జగనన్న కోరిక కూడా నరేంద్ర భయ్యా నెరవేర్చడం లేదు.