English | Telugu

ప్రతిపక్ష హోదాపై జగన్ వెనక్కు.. కానీ..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై మంకుపట్టు వీడారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం (సెప్టెంబర్ 18) ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సమావేశాల్లో తాను సభకు రావడానికి సిద్ధమేనని ప్రకటించారు. హోదా కోసం ఇంత కాలం మంకుపట్టు పట్టి, కోర్టును కూడా ఆశ్రయించిన జగన్.. ఇప్పుడు బేషరతుగా అసెంబ్లీకి హాజరు కావడానికి రెడీ అని ప్రకటించడం విస్మ యం గొలుపుతోంది.

కాగా జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో జరిపిన భేటీలో అసెంబ్లీ, మండలిలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అదే విధంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా తాను సభకు వస్తాననీ, అయితే సభలో తనకు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలని అన్నారు. అయితే స్పీకర్ మాత్రం సభలో ఒక ఎమ్మెల్యేకు మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో అంతే సమయం ఇస్తానని అంటున్నారనీ, అలా అయితే.. అలా అయితే ప్రజా సమస్యలను వివరంగా చెప్పడం ఎలా సాధ్యమౌతుందని అన్నారు.

దీంతో అసలు జగన్ ఏం చెప్పారు? ఆయన అసెంబ్లీకి వస్తారా? రారా? కనీసం ఆయన పార్టీ ఎమ్మెల్యేలనైనా సభకు పంపుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ప్రతిపక్ష హోదా విషయంలో వెనకడుగు వేసిన జగన్.. సభలో మాట్లాడే సమయం విషయంలో మాత్రం పట్టుబడుతున్నారు. సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అయిన జగన్ సభలో మాట్లాడే సమయం విషయంలో పట్టుబట్టడాన్ని చూస్తుంటే.. ఆయన సభకు హాజరయ్యే అవకాశాలు లేవనే అంటున్నారు.