English | Telugu

జగన్ ప్రభుత్వం పై మండిపడ్డ ఏపీ హైకోర్టు..

ఏపీ హైకోర్టు జగన్ ప్రభుత్వంపై మండి పడింది. ఏపీలో కొన్ని వితంతు పెన్షన్లు నిలిపివేయడంతో హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది. రాజకీయ కారణాలతో పెన్షన్లు నిలిపివేశారన్న కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వితంతువులంటూ కొంతమంది అబద్దాలు చెబుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేయడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త ఉన్నప్పటికీ ఏ మహిళా కూడా వితంతువునని చెప్పుకోదని, అసలు ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలుసని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కేవలం వారి ఆర్ధిక కష్టాలను కొంతవరకు తీరుస్తుందని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.

పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా?.. లేక రంజాన్ తోఫా, క్రిస్‌మస్ కానుకలు ఇవ్వమని ఎవరైనా అడిగారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వెయ్యమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా.. అని కోర్టు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. పేదల సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడాన్ని ఎవరూ కాదనరని, అయితే పెన్షన్లు ఆపిన వితంతువులకు 15 రోజుల్లోగా పెన్షన్లు ఇవ్వాలని, పాతపెన్షన్లు ఇవ్వడంతో పాటు భవిష్యత్‌లో కూడా పెన్షన్లు చెల్లించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.