English | Telugu

జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు మరో షాక్.. విశాఖ ఫ్యూజన్ ఫుడ్స్ పై స్టేటస్ కో

ఏపీలో జగన్ సర్కార్ కు ఏపి హైకోర్టు మరో షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా విశాఖలోని వీఎంఆర్‌డీఏ స్థలంలో హోటల్ నిర్వహిస్తున్నారంటూ ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌ను అధికారులు సెలవు రోజైన ఆదివారం నాడు బలవంతంగా ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హోటల్ నిర్వహకులు హైకోర్టును ఆశ్రయించగా ఈ​ విషయంలో (స్టేటస్ కో) యధాతధస్థితి పాటించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

లీజు గడువు పూర్తికాకముందే తమ హోటల్​ విషయంలో ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఫ్యూజన్​ ఫుడ్స్​ హోటల్ యజమాని హర్షవర్ధన్​ ప్రసాద్​ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా హడావుడిగా హోటల్​ను ఖాలీ చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని...ఇది చట్ట విరుద్ధమని అయన తన పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ బి.కృష్ణ మోహన్​ విచారణ జరిపి యధాతధ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసారు. అంతేకాకుండా తమ అనుమతి లేకుండా ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.