English | Telugu
హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ కు ఊహించని రెండు షాకులు!!
Updated : Oct 5, 2019
ఇటీవలే హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ కు రెండు వారాల ముందు ఎన్నికల సంఘం టీఆర్ఎస్ కు ఎదురుకోలేని షాక్ లను ఇచ్చింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇతర పార్టీల వారిని నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లను బాధ్యతల నుంచి తప్పించింది. ఆయనను హుజూర్ నగర్ ఎన్నికల విధుల నుంచి తప్పించడమే కాకుండా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేసింది. వెంకటేశ్వర్లు స్థానంలో భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్ ను ఎంపిక చేసి, సూర్యాపేట జిల్లా ఎస్పీగా నియమించింది.మరొక షాక్ గా ఆదాయ పన్ను శాఖలో సింగంగా పేరుగాంచిన బీఆర్ బాలకృష్ణన్ ను హుజూర్ నగర్ కు ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా నియమించింది. ఆయన ఎన్నికల్లో డబ్బు పంపిణీని అడ్డుకోవడంలో కడు సమర్థుడు. ఆయన ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిగా రెండు శాసన సభ ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బులు పట్టుకుని ఏకంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు. పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన బాలకృష్ణన్ పెద్ద నోట్ల రద్దు సమయంలో కర్ణాటక గోవాల్లో నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని కక్కించారు. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కుటుంబాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ప్రస్తుతం రిటైరైన ఎన్నికల సంఘానికి సేవలందిస్తున్నారు.
వెంకటేశ్వర్లను తప్పించడం బాలకృష్ణన్ ను నియమించడం ఈ రెండు పరిణామాలతో అధికార పక్షానికి ఉప ఎన్నికల్లో ఉండే అవకాశనికి గండి పడినట్లేనని భావిస్తున్నారు. ఎన్నికల యంత్రాంగన్ని పర్యవేక్షించటం ఇంటిలిజెన్స్ అందించే వివరాల ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోవటం వ్యక్తులూ, పార్టీలూ, ఓటర్లకు డబ్బు, మద్యం ఇతర బహుమతులు ఇస్తున్నారనీ 'సీ విజిల్' హెల్ప్ లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవటం వేయ పరిశీలకుల బాధ్యత. ఇలాంటి చోట్ల గట్టి అధికారులనూ వేస్తే రాజకీయ పార్టీలకు ఉక్కపోత తప్పదు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, మురళీధరరావు, వివేక్ తో కూడిన బృందం సీఈసీ సునీల్ అరొరాని కలిసింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని నామినేషన్ లు కూడా బెయిల్ రాకుండా అడ్డుకున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చింది. బీజేపీ నేతల ఫిర్యాదు అందిన ఇరవై నాలుగు గంటల్లోపే ఎన్నికల సంఘం స్పందించి రెండు కీలక నిర్ణయాలు తీసుకోవటం గమనార్హం. ఈ రెండూ నిర్ణయాల ద్వారా ఈసీ ఎన్నికలు తన అదుపాజ్ఞలలో జరుగుతున్నాయని నిరూపించింది. హుజూర్ నగర్ లో నియమించిన ఇద్దరు అధికారులు తమిళనాడుకు చెందిన వారే కావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిర్ణయం పై లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు.
సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్ నేతృత్వంలో సర్పంచ్ ల నామినేషన్ వేయటానికి హుజూర్ నగర్ కు రాగా నామినేషన్ లు దాఖలు చేయనివ్వకుండా వారిని పట్టణ పరిసరాల్లో పోలీసులు అడ్డుకున్నారని భూమన్నను అక్రమంగా అరెస్టు చేసి, జైలుకు తరలించారని బిజెపి ఆరోపించింది. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తున్నారని అందుకే భూమన్నను అరెస్ట్ చేశారని విమర్శించింది. పోలీసుల సహకారంతో టీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం లేదని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ఎస్పీని బదిలీ చేసినట్లు తెలిసింది. జిల్లా అధికార యంత్రాంగం వ్యవహార శైలిపై గత నెలలోనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి స్వయంగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుజూర్ నగర్ లో గెలుపొందాలని పట్టుదలతో ఉంది. సీనియర్ నేతలను ఇన్ చార్జీలుగా నియమించారు. ఎస్పీతో పాటు, కోదాడ డీఎస్పీ హుజూర్ నగర్ సీఐలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉత్తమ్ ఇటీవల బాహాటంగా విమర్శించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పైనే బదిలీ వేటు పడటం అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్టేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద పెద్ద నేతల సైతం ఈ ఎన్నికల విషయాన్ని గట్టి పోటీగా భావిస్తుండడాం విశేషం.