English | Telugu

ఫోన్ లో డాక్టర్ సూచనలతో ప్రెగ్నెంట్ కు డెలివరీ చేసిన మహిళా ఎస్ఐ

బాగా పాపులర్ అయిన హిందీ సినిమా "త్రీ ఇడియట్స్" లో డాక్టర్ అయిన హీరోయిన్ కరీనా కపూర్ సూచనలతో అమిర్ ఖాన్ ఒక ప్రెగ్నెంట్ కు డెలివరీ చేయించడం మనమందరం చూసాం. తాజాగా ఒక మహిళా ఎస్ఐ వైద్యురాలి అవతారం ఎత్తి ఒక మహిళకు పురుడు పోసింది. అర్థరాత్రి సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆ ఎస్ఐ అన్నీ తానై వ్యవహరించి ఆమెకు అండగా నిలబడింది. అక్కడ ఆ మహిళకు వైద్యం చేయడానికి సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఈ మహిళా ఎస్ఐ వైద్యురాలిగా మారి.. ఫోన్ లో డాక్టర్ సూచనల మేరకు వైద్యం చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని రావత్‌పురా జిల్లా బింద్‌లో నివసిస్తున్న బాద్‌షా తన భార్య పూజ (19) తో కలిసి గోవా ఎక్స్‌ప్రెస్‌లో దౌండ్ నుంచి గ్వాలియర్ వెళ్తున్నారు. అయితే దారి‌లో పూజకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో వారు ఝాన్సీ రైల్వే స్టేష‌న్‌లో దిగిపోయారు. దీంతో అంత రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేక‌పోవ‌డంతో పాటు ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్లే సమయం కూడా లేకపోవడంతో అక్కడే ఉన్న మ‌హిళా ఎస్ఐ రాజ‌కుమారి గుర్జర్ మరికొంత మంది మహిళల సాయంతో ఏసీ కేబిన్ నుండి కొన్ని దుప్పట్లు తీసుకుని ఆ గ‌ర్భిణికి డెలివ‌రీ చేసేందుకు ముందుకు వ‌చ్చారు. ఆ గర్భిణీ పరిస్థితిని గ‌మ‌నించిన మ‌హిళా ఎస్‌ఐ ‌ తన స్నేహితురాలైన‌ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలు కసోటియాకు వీడియో కాల్ చేశారు. ఆ డాక్టర్ ఫోనులో సూచ‌న‌లు ఇస్తుండ‌గా ఆ సూచనల ప్రకారం ఎస్ఐ రాజ‌కుమారి ఆ గ‌ర్భిణికి సుర‌క్షితంగా డెలివ‌రీ చేసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. ఆ తరువాత అంబులెన్స్‌ను పి‌లిపించి త‌ల్లీబిడ్డ‌లను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆ తల్లి బిడ్డ ఆసుప‌త్రిలో ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన పై ఆ గర్భిణీ భర్త అయిన బాద్‌షా స్పందిస్తూ మ‌హిళా ఎస్ఐ రాజ‌కుమారి గుర్జర్ కనుక లేకపోతె తన భార్య బిడ్డ కూడా దక్కేవారు కాదని అంటూ.. ఆమెకు కృతఙ్ఞతలు తెలిపారు.