English | Telugu

చిత్తూరు చింత.. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది

చిత్తూరు జిల్లాలో చిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో 13 స్థానాలను కైవసం చేసుకుని తన సత్తా చాటింది వైసిపి. జిల్లాలో ఆ పార్టీకి మెజారిటీ స్థానాలు రావటం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పాత్ర ముఖ్యంగా ఉంది. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో తన సొంత మనుషులను నిలబెట్టి గెలిపించుకున్న సత్తా ఆయనది. అధికారం లేకున్నా గడిచిన 5 ఏళ్లు జిల్లాలో పార్టీకి అన్ని విధాలా అండదండలు అందించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి జగన్ సర్కర్ లోనూ కీలక మంత్రి పదవి దక్కించుకున్నారు. వైసిపి అధికారంలోకి వస్తే పెద్దిరెడ్డికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించారు. కాకపోతే జిల్లాలోని రిజర్వ్ నియోజకవర్గమైన జీడీ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణ స్వామికి అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇదివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. జిల్లా నుంచి రోజా, భూమన కరుణాకరరెడ్డి లాంటి వ్యక్తులను కాదని ఎస్సీ కోటాలో నారాయణ స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్.

అయితే ఒకే ఒరలో రెండు కత్తులులా జిల్లాలో పెద్దిరెడ్డి, నారాయణ స్వామి మారారనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి మంచి మిత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి , నారాయణస్వామిల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోందంటున్నారు. పెద్దిరెడ్డికి విధేయుడిగా ఉంటున్న నారాయణ స్వామి ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నారని ఒకటే గుసగుసలు. ఉద్యోగుల బదిలీలు, కాంట్రాక్టు నియామకాల్లో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాకపోతే అదంతా ఉత్తుత్తి ప్రచారమే కానీ తమ మధ్య అలాంటిదేమి లేదని చెబుతున్నారు నారాయణ స్వామి. చాలా ఏళ్లుగా పెద్దిరెడ్డి, తాను మంచి మిత్రులమని ఈ కోల్డ్ వార్ గురించి తనకేమీ తెలియదని చెబుతున్నారు. కానీ పార్టీలో మాత్రం వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే గుసగుసలకు మాత్రం అడ్డూ అదుపూ ఉండడంలేదు.