English | Telugu

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం ఆవేదన!

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రసాయన వాయువు లీకైన ఘటనలో ఇప్పటి వరకు 8మంది మృతిచెందగా, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. సీఎం ఇవాళ మధ్యాహ్నం విశాఖ వెళ్లనున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.

బాధితులను కాపాడేందుకు అంబులెన్స్‌లు, మెడికల్‌ కిట్‌లతో భారత నావికాదళం రంగంలోకి దిగింది. రసాయన వాయువు ప్రభావానికి వెంకటాపురం గ్రామంలోని మూగజీవాలు మృత్యువాత పడగా, చెట్లన్నీ రంగు మారాయి. ఈ వాయువు గాల్లోకి వ్యాపిస్తుండడంతో.. పరిసర గ్రామాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.