English | Telugu

క‌రోనా చికిత్స‌కు గాంధీ, గ‌చ్చిబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్!

చంద్రబాబు ఎప్పుడో 18 ఏళ్ల కిందట కట్టించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అక్కరకు వచ్చింది. 2002 లో హైదరాబాద్ లో జాతీయ క్రీడలు నిర్వహించినప్పుడు గచ్చిబౌలి లో స్పోర్ట్స్ విలేజ్ కట్టించారు. అందులో కొంత అమ్మి కొంత ప్రభుత్వం కింద ఉంచారు. 14 అంతస్థుల తో 540 గదులు ప్రభుత్వం కింద ఉన్నాయి. హైదరాబాద్ లో స్పోర్ట్స్ ఈవెంట్లు జరిగినప్పుడు వస్తున్న వారికి వసతి కోసం ఇన్నాళ్లు వాడారు. ఇప్పుడు అందులో టిమ్స్ పేరుతో హాస్పిటల్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క పైసా ఖర్చు లేకుండా రెడీమేడ్ గా ఉన్న భవనంలో దీనిని పెడుతున్నారు.

అధికారం లో ఉన్నప్పుడు ముందుచూపుతో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే తర్వాత అవి ఎలా ఉపయోగ పడతాయనడానికి ఇది ఒక ఉదాహరణ.

హైదరాబాద్ లో ముషీరాబాద్ లో ఉన్న జైలు తొలగించి చంద్రబాబు ప్రభుత్వం గాంధీ హాస్పిటల్ కొత్త భవనం కట్టింది. ఇప్పుడు అందులోనే గాంధీ ఆస్పత్రి నడుస్తోంది. 2004 లో చంద్రబాబు దిగిపోయి ఇప్పటికి 16 సంవత్సరాలు. హైదరాబాద్ లో ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఒక్క కొత్త ఆస్పత్రి భవనం కట్టలేదు. ఉస్మానియా ఆసుపత్రి కి కొత్త భవనం కడతామని హడావుడి చేశారు. కట్టలేదు. ఈ 16 ఏళ్లలో హైదరాబాద్ జనాభా రెట్టింపు అయింది. ఇప్పుడు ఇన్ని రోజులకు ఒక కొత్త ఆస్పత్రి పెడతామని అంటున్నారు. అదీ చంద్రబాబు కట్టించిన భవనంలో. హైదరాబాద్ లో బొక్కల ఆస్పత్రి గా పిలిచే నిమ్స్ ను ఎన్టీఆర్ బాగా డ‌వ‌ల‌ప్ చేశారు. అమెరికా నుంచి డాక్టర్ కాకర్ల సుబ్బారావు ను పిలిపించి ఆయన చేతికి నిమ్స్ అప్పగిస్తే దానిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చి దిద్దారు. చంద్రబాబు హయాంలో అది ఇంకా పెరిగింది. మంత్రులు కూడా అక్కడే చికిత్స చేయించుకొనేవారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో హైదరాబాదులోని గచ్చిబౌలిలో నిర్మించిన జి.ఎం.సి.బాలయోగి క్రీడామైదానం ఆరోగ్యశాఖకు అప్పగించారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ నేతలు గత టిడిపి ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో దీని ద్వారా నైనా గుర్తించాలని టిడిపి నేత‌లంటున్నారు.