English | Telugu

జైల్లో ఉన్నప్పుడే తన బలమేంటో చూపించారు... ఇప్పుడు ప్రభుత్వాధినేతగా... జగన్ పై సీబీఐ వాదనలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ...జైల్లో ఉన్నప్పుడే తన బలమేంటో చూపించారని, ఇప్పుడు ప్రభుత్వాధినేతగా మరింత ప్రభావితం చేస్తారంటూ సీబీఐ వాదనలు వినిపించింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టులో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. జగన్ జైల్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని, ఇప్పుడు ప్రభుత్వాధినేతగా మరింతగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని సీబీఐ గట్టిగా వాదించింది. వాస్తవాలను దాచిపెట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారంటూ సీబీఐ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర విభజనతో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, ఇది అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమంటూ సీబీఐ... కోర్టుకు తెలిపింది.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనేక సౌకర్యాలు కల్పిస్తారని, ఆ సౌకర్యాలతో వారానికోసారి విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం పెద్ద కష్టమేమీ కాదని సీబీఐ వాదించింది. జగన్ పిటిషన్ పై తీవ్ర అభ్యంతరం తెలిపిన సీబీఐ... ఏపీలో రెవెన్యూ లోటు కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరడం సరికాదని తెలిపింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వ్యక్తిగతంగా హాజరుకావడం ఎంతో అవసరమన్న సీబీఐ.... జగన్ పిటిషన్ ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని కోరింది.