English | Telugu

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం.. జగన్ సర్కార్ తో జీఎంఆర్‌ ఒప్పందం

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ఏపీ ప్రభుత్వంతో జీఎంఆర్‌ ఒప్పందం కుదర్చుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్‌ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాలవలవన్, జీఎంఆర్‌ ఛైర్మన్‌ జీబీఎస్‌. రాజు సంతకాలు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ ఆర్కే రోజా, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సీఎం ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని జీఎంఆర్‌ ప్రతినిధులు తెలిపారు. దీనికోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నామని జీఎంఆర్‌ ప్రతినిధులు అన్నారు.

ఉత్తరాంధ్రప్రాంతానికి మంచి సదుపాయం వస్తుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఎయిర్‌ పోర్టునుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా, సులభంగా, సౌకర్యంగా చేరుకునేలా రహదారులను నిర్మిస్తామని సీఎం చెప్పారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తిచేస్తామన్నారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖ నగరంతో అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటు పైనా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం జగన్ చెప్పారు.