English | Telugu

నాలుగు సార్లు టెస్టు చేసినా నెగటివ్.. అయినా ప్రాణాలు పోయాయి

కరోనా వైరస్ లక్షణాలు పైకి కనిపించిన వారు అనుమానం తో టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వస్తే చికిత్స చేయించుకుంటున్నారు. ఐతే లక్షణాలు ఉండి టెస్టుల లో నెగటివ్ వస్తే మాత్రం పరిస్థితి అయోమయం లో పడి చికిత్స ఆలస్యమవడం తో ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. ఇటువంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల 26 మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో అక్కడే పని చేస్తున్న ఏఎస్ఐ ప్రేమ్ కుమార్ కూడా కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ రావడంతో తిరిగి విధులకు హాజరయ్యారు. ఐతే కొద్ది రోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయించుకోవాలని పై అధికారులు సూచించడంతో మళ్ళీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. ఐతే మళ్లీ నెగిటివ్‌గానే ఫలితం వచ్చింది.

ఇది ఇలా ఉండగా గడచిన కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో అయన బాధపడుతున్నాడు. దీంతో మరో సారి ఆ ఏఎస్ఐ కరోనా పరీక్షలు చేయించుకోగా మళ్లీ రిజల్ట్ నెగిటివ్‌గానే వచ్చింది. మొత్తం నాలుగు సార్లు పరీక్షలు చేయించుకోగా.. నాలుగు సార్లు నెగిటివ్‌ ఫలితమే వచ్చింది. కానీ అయన పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు నగరంలోని పలు ఆసుపత్రులలో చేర్చే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు బెడ్ లు ఖాళీ లేవంటూ ప్రేమ్ కుమార్‌ను చేర్చుకోలేదు.

ఆయనకు అంతకు ముందు చేసిన కరోనా టెస్టులన్నింటిలో నెగిటివ్ ఫలితం రావడంతో చివరికి గాంధీ ఆస్పత్రిలోనూ చేర్చుకోలేదు. దీంతో విషయం తెలుసుకున్న కొందరు పోలీసు ఉన్నతాధికారులు చిరవ తీసుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగలిగారు. ఐతే అప్పటికే ఆ ఏఎస్ఐ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఇక్కడ కూడా మరోసారి కరోనా వైరస్ నిర్దారణ పరీక్ష జరపగా అక్కడ కూడా నెగిటివ్‌గా ఫలితం వచ్చింది. ఆ మరుసటి రోజుకు ప్రేమ్ కుమార్ కిడ్నీలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో డాక్టర్లు మళ్లీ కరోనా పరీక్షలు చేశారు కానీ ఆ రిజల్ట్ వచ్చేలోపే ప్రేమ్ కుమార్ ప్రాణాలు విడిచారు. అయన మరణం తరువాత వచ్చిన టెస్ట్ ఫలితంలో మాత్రం పాజిటివ్ ‌గా తేలింది. దీంతో ముందుగా చేయించుకున్న నాలుగు టెస్టులలో నెగిటివ్ రావడమే ఆ ఏఎస్ఐ మ‌ృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.