English | Telugu

జగన్ సర్కార్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్.. 

ఏపీలో స్థానిక ఎన్నికలు జరిపే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ తాజాగా పతాక స్థాయికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో మరో పిటిషన్ ను దాఖలు చేసింది. తాజాగా దాఖలు చేసిన పిటిషన్ లో జగన్ సర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఎన్నికల సంఘం పేర్కొంది .

వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఏపీ సర్కార్ తెగేసి చెబుతోంది. ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బందిని, పోలీసులను ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సిన్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బంది కల్గిస్తోందని ఏపీ ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ శుక్రవారం నాడు ఏపీ ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.