English | Telugu
ఏపీ డీజీపీకి మరో సారి హైకోర్టు పిలుపు...
Updated : Jun 23, 2020
వివిధ కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను తమకు అప్పగించడం లేదని అనేకమంది వాహన దారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మధ్య కాలంలో అక్రమ మద్యం తరలింపు పేరుతో వేల సంఖ్యలో వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 34(ఏ) సెక్షన్ కింద కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న వాహనాలను మేజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎదుట హాజరు పరచాల్సి ఉంటుంది. అయితే పోలీసులు ఈ నిబంధనలను పక్కనపెట్టి పోలీస్ స్టేషన్లలోనే ఉంచడంతో అవి ఎండకు ఎండి, వానకు తడిసి పాడైపోతున్నాయి. దీంతో తమ వాహనాలను చట్టబద్ధంగా విడిపించుకునే ప్రయత్నం చేసినా పోలీసులు అంగీకరించడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా నిబంధనల మేరకు తాము మూడు లేదా అంతకంటే తక్కువ మద్యం బాటిళ్లను తమ వాహనాల్లో తీసుకెళ్తున్నప్పటికీ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్లు వేర్వేరుగా పిటిషన్లు వేశారు.
దీని పై సోమవారం విచారం జరిపిన హైకోర్టు ఎక్సైజ్ యాక్ట్లోని సెక్షన్ 46, సీఆర్పీసీ సెక్షన్ 102 నిబంధనలు పాటించని సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి డీజీపీ నుండి వివరాలు సేకరించి చెప్పాలని కేసును మంగళవారానికి వాయిదా వేసింది. ఈ రోజు జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది ఆ వివరాలు చెప్పకపోవడం తో అహ్రాహించిన హైకోర్టు ధర్మానసం నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి బుధవారమే డీజీపీ హైకోర్టు ఎదుట హాజరు కావలసి ఉంది.