English | Telugu

మీరు అవునంటే మేము కాదనిలే.. ఎన్నికల కమిషన్ కు ఏపీ సర్కార్ లేఖ 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్న సమయంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం దీనిపై స్ప‌దించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న వేళ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని, కరోనా నేపథ్యంలో చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిన విషయాన్ని సీఎస్ ఆ లేఖలో ప్రస్తావించారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి సమయంలో మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కనుక ఎన్నికలు జరిపితే వైరస్ గ్రామాలకు కూడా పాకిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులు, పరిపాలన సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని.. పరిస్థితి అనుకూలించిన వెంటనే ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తామని సీఎస్ ఆ లేఖలో తెలిపారు. ప్రజల ఆరోగ్యం, భద్రత నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఎంతమాత్రమూ ఆమోద యోగ్యం కాదని అన్నారు. అలాగే, ఎన్నికల కమిషన్ నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిసిందని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది కూడా అవసరం లేదని తాము భావిస్తున్నట్టు నీలం సాహ్ని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం అవుతున్నారు.