English | Telugu
హైదరాబాద్ లో మరో దారుణం.. పట్టపగలు 35 ఏళ్ల మహిళ సజీవ దహనం
Updated : Nov 30, 2019
శంషాబాద్ ప్రాంతం వరుస హత్యలతో అట్టుడుకుతోంది. ప్రియాంక రెడ్డి దారుణ హత్యను మరువక ముందే హైదరాబాద్ శివార్లలో మరో ఘోరం జరిగింది. 35 ఏళ్ల మహిళను దుండగులు తగులబెట్టారు. శంషాబాద్ సిద్ధులగుట్ట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోచమ్మ దేవాలయం పక్కనే ఆ మహిళను దహనం చేశారు. ఆమె చీర ధరించి ఉంది, చేతికి గాజులు ఉన్నాయి, ఆమెని ప్రియాంక హత్య తరహాలోనే మరో చోట చంపేసి డెడ్ బాడీని తగులబెట్టారా లేద అక్కడికే తీసుకొచ్చి చంపేసి తగులబెట్టారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రియాంకని చంపిన ప్రాంతానికి ఈ మహిళ డెడ్ బాడీ కనిపించిన ప్రాంతానికి దూరం కేవలం ఒక్క కిలో మీటర్ మాత్రమే. ఈ మహిళ ఎవరన్నది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం మహిళల మిస్సింగ్ ఫిర్యాదులను పోలీసులు సేకరిస్తున్నారు.
సిద్ధుల గుట్ట దగ్గర మహిళను తగలబెట్టిన ప్రాంతానికి 200 ల మీటర్ల దూరంలో హీరో రవితేజ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ చూసేందుకు వచ్చిన నలుగురు స్థానికులు మంటలను గమనించి ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 70 శాతానికి పైగా బాడీ కాలిపోయింది. 48 గంటల వ్యవధిలో 2 ఘటనలు ఇలా కలకలం రేపుతున్నాయి. ఇద్దరూ మహిళలే, ఇద్దరి డెడ్ బాడీలను తగలబెట్టారు. 35 ఏళ్ల మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు, ఇవాళ పోస్టుమార్టం చేయనున్నారు.
సజీవ దహనం జరిగిన స్పాట్ ని శంషాబాద్ డిసిపి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్స్ కూడా రంగంలోకి దిగాయి. హత్య జరిగిన ప్రదేశంలో కొన్ని ఆధారాలను సేకరించారు. మృతురాలి చెప్పులు, దుస్తులను క్లూస్ టీం స్వాధీనం చేసుకుంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన చోటు నుంచి ఔటర్ రింగ్ రోడ్ వైపు డాగ్ స్క్వాడ్ వెళ్లింది. దీని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. సమీపంలోని పోచమ్మ గుడిలో ఉన్న అయ్యప్ప స్వాములను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. ఖాళీగా ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లో అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.