ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేస్తోన్న అప్పులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని క్రెడిట్ రేటింగ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన లెక్కలు హెచ్చరిస్తున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రుణ-జీఎస్డీపీ నిష్పత్తి 34.6% కి చేరనున్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది. ఈ నిష్పత్తి 25% వరకే ఉండాలని 14వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. దాంతో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా ఉన్నప్పటికీ రుణ-జీఎస్డీపీ నిష్పత్తిని 25% పరిధిలోనే ఉంచుకున్నట్లు క్రెడిట్ రేటింగ్స్ సంస్థ పేర్కొంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే మాత్రం 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన దాని కంటే దాదాపు పది శాతం అధికం ఉంది.క్రెడిట్ రేటింగ్స్ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రుణ-జీఎస్డీపీ నిష్పత్తి 21.4% ఉండగా, ఆంధ్రప్రదేశ్ ది అంతకంటే 13.2% అధికంగా ఉంది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ప్రదేశ్ (28.8%), పశ్చిమ బెంగాల్ (33.3%), రాజస్థాన్ (33.1%)లతోపాటు కేరళ(30.1%) కంటే ఆంధ్రప్రదేశ్ రుణ-జీఎస్డీపీ నిష్పత్తే (34.6%) అధికంగా ఉన్నట్లు ఆ సంస్థ వివరించింది.
ఇక, అప్పులపై వడ్డీ చెల్లింపుల భారమూ ఆంధ్రప్రదేశ్ పై అధికంగానే ఉంది.రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 2021 ఆర్థిక సంవత్సరంలో వడ్డీల కింద 12.6%, రుణ చెల్లింపుల కింద 22.5% ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.ఈ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం గ్యారెంటీల పరిమాణం రూ.49,442 కోట్లకు చేరింది.తాజా లెక్కల ప్రకారం అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచింది. 2020 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంపై రూ.3,41,270 కోట్ల రుణభారం ఉన్నట్లు క్రెడిట్ రేటింగ్స్ సంస్థ పేర్కొంది. రుణభారం పరంగా తెలంగాణ రూ.1,68,725 కోట్లతో 14వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.