English | Telugu

కేంద్రంతో చర్చల ప్రసక్తే లేదు.. ఆ బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందే: తేల్చి చెప్పిన రైతులు

ఎన్డీయే సారధ్యం లోని కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు తీవ్ర నష్టం చేసేలా ఉన్నాయంటూ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది రైతులు దేశ రాజధాని ఢిల్లీ ని చుట్టుముట్టి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని షరతులతో కేంద్ర ప్రభుత్వం చేసిన చర్చల ప్రతిపాదనను ఆందోళన చేస్తున్న రైతులు తిరస్కరించారు. రైతు నాయకులను చర్చల కోసం బురారీ మైదానానికి రావాలని కేంద్రం కోరగా.. నిరసన చేస్తున్న రైతులందరికి డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన తెలిపే అవకాశాన్ని ఇచ్చేవరకు ఆందోళనను కొనసాగిస్తామని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. దీంతో ఇరువురి మధ్య ప్రతిష్టంభన నెలకొంది.

దీంతో రైతుల నిరసన, అలాగే ప్రభుత్వ చర్చల ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో నిన్న అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, వ్యవసాయ మంత్రి తోమర్ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాజాగా ఢిల్లీని అన్ని వైపుల నుండి దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాకుండా హర్యానా సీఎం ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా కేంద్ర మంత్రుల మధ్య చర్చకు వచ్చాయి. దీంతో పాటు నిరసన తెలుపుతున్న రైతుల విషయంలో తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలను తీవ్రం గా నిరసిస్తూ ఉద్యమించిన ఉత్తర భారతానికి చెందిన రైతులు వరుసగా నాలుగో రోజూ ఢిల్లీ పొలిమేరల్లోనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌, హరియాణ, యూపీ, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ల నుంచి వేలాది మంది రైతులు వణికే చలిని కూడా లెక్క చేయకుండా తమ నిరసన కొనసాగిస్తున్నారు.