English | Telugu

సుశాంత్‌ సింగ్‌ మృతిపై ఎయిమ్స్‌ కీలక రిపోర్టు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మృతి కేసులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) కీలక రిపోర్టును సమర్పించింది. సుశాంత్‌ మృతికి గల కారణాలను సుదీర్ఘంగా పరిశీలించిన ఎయిమ్స్‌ వైద్యులు మంగళవారం తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.

సుశాంత్‌ మృతదేహంలో ఎలాంటి విషం లేదని స్పష్టం చేశారు. ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని తెలిపారు. సుశాంత్‌ డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరంలేదని పేర్కొన్నారు. సుశాంత్‌ మృతికి సంబంధించి గతంలో మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే తమ పరిశీలనలో తేలాయని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. సుశాంత్‌ మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు.

కాగా, సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్‌ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన కుమారుడిని హత్య చేసి ఉంటారని అతని తండ్రి బిహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక వివాదాలు, ఆరోపణల నడుమ ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎయిమ్స్‌ తన రిపోర్టును సమర్పించింది. సుశాంత్‌ ది ఆత్మహత్యేనని తెలిపింది.