English | Telugu

ట్విట్టర్ వేదికగా లోకేష్ పై విజయసాయి, జగన్ పై అయ్యన్న అదిరిపోయే కౌంటర్లు

వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడైన లోకేష్ పై సెటైర్లు వేశారు. ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో "ఎవరు దళిత పక్షపాతో, ఎవరు దళిత ద్రోహో" అంటూ లోకేష్ పేరు మీద ఒక వ్యాసం ప్రచురితమైంది. తాజాగా దీని పై కామెంట్ చేస్తూ "నీకు సరిగా తెలుగు మాట్లాడడమే రాదు, అప్పుడే వ్యాసాలు రాస్తున్నావా చిట్టీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. అంతేకాకుండా "దళితునిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న మీ నాన్నారుని అడుగు... ఎవరు దళిత పక్షపాతో, ఎవరు దళిత ద్రోహో చెబుతాడు. దళిత రిజర్వుడు స్థానాల్లో గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు గెలిచిందో లెక్కలు చూసుకో లోకేశం" అంటూ విజయసాయిరెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు.

అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లోకేష్ పై చేసిన సెటైరికల్ కామెంట్లకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "వివేకానందరెడ్డి చనిపోతే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానన్న నువ్వు తెలుగు కోసం మాట్లాడడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది" అంటూ ఎంపీ విజయసాయికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా "గుంటూరుని గుండూరు అనే మీ గన్నేరుపప్పుకి ముందుగా తెలుగు నేర్పించి లైవ్ లో కూర్చోబెట్టు" అంటూ సీఎం జగన్ పై సెటైర్ వేశారు. అలాగే పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ అయ్యన్న ఈ సందర్భంగా మండిపడ్డారు. ఒక దళిత యువకుడ్ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపిన చెత్త ప్రభుత్వం మీది అంటూ ఎపి ప్రభుత్వం పై అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జగన్ రెడ్డి.. నీకు దళిత జాతి వచ్చే ఎన్నికల్లో, గుండు కొట్టడం ఖాయం అంటూ ట్విట్టర్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.