English | Telugu

సామాన్య భక్తులపై కక్షగట్టిన టీటీడీ... అద్దె గదుల ధరలు అమాంతం పెంపు... 

తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి సామాన్య భక్తులకు షాకిచ్చింది. శ్రీవారి దర్శనం దగ్గర్నుంచి వసతుల వరకు ప్రతి విషయంలోనూ సామాన్య-మధ్యతరగతి భక్తులను చిన్నచూపు చూసే టీటీడీ... సడన్ గా ఊహించని ఝలక్ ఇచ్చింది. సామాన్యులు ఉంటే అద్దె గదుల ధరలను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. తిరుమలలోని దాదాపు అన్ని గెస్ట్‌-హౌస్‌ల్లోని గదుల అద్దెలనూ రెట్టింపు చేసింది. తిరుమల నందకం అద్దె గదుల ధరను 600 నుంచి వెయ్యికి పెంచగా, కౌస్తుభం, పాంచజన్యంలో రూమ్స్‌‌ను 500 నుంచి వెయ్యి రూపాయలకి పెంచారు. అలాగే, కనీస వసతి ధరను వంద రూపాయలు చేశారు. అయితే, ఈ అద్దె గదుల ధరల పెంపు కేవలం తిరుమలలో మాత్రమే చేసింది. దాంతో తిరుపతిలో యథావిధిగా పాత ధరలే కొనసాగనున్నాయి.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దివ్యసుందర రూపాన్ని క్షణకాలం చూసి ఆనందంతో పరవశించిపోతారు. అయితే, శ్రీవారి భక్తుల్లో ఎంతోమంది భాగ్యవంతులు ఉన్నా... ఎక్కువగా సామాన్య-మధ్యతరగతి వాళ్లే ఉంటారు. అంతేకాదు శ్రీవారి దర్శనం రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడంతో... సాధారణ అద్దె గదులను ఆశ్రయిస్తారు. ముఖ్యంగా 100 రూపాయల గదులను తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. కానీ, వంద రూపాయల గదులు తక్కువగా ఉండటం, అవి అందరికీ దొరకని పరిస్థితి ఉండటంతో... ప్రత్యామ్నాయంగా ఐదొందలు, ఆరొందల గదులను ఆశ్రయిస్తారు. అయితే, ఈ గదుల ధరలనే ఇప్పుడు టీడీపీ అమాంతం డబుల్ చేసింది. దాంతో, సామాన్య భక్తులు... టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు. సాధారణ భక్తులు ఉండే అద్దె గదుల ధరలను రెట్టింపు చేయడంతో.... ఆ అదనపు ఆర్ధిక భారాన్ని తట్టుకోవడం తమ వల్ల కాదంటున్నారు.