English | Telugu

యూపీలో రాహుల్ గాంధీ అరెస్ట్.. పరిస్థితి ఉద్రిక్తం 

యూపీలోని హత్రాస్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయత్నించగా, దారిలోనే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తన కాన్వాయ్ తో యూపీ బయల్దేరిన రాహుల్ గాంధీని పోలీసులు గ్రేటర్ నోయిడా వద్ద నిలిపివేశారు. దాంతో ఆయన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలినడకన ముందుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా యమున ఎక్స్ ప్రెస్ హైవేపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రాహుల్, ప్రియాంక‌ కాన్వాయ్‌ దిగి 172 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హా‌త్రాస్ మార్గంలో నడక ప్రారంభించారు. హత్రాస్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, అక్కడికి వెళ్లడం మానుకోవాలని పోలీసులు రాహుల్ గాంధీకి సూచించారు. అయితే ఆయన ముందుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అయినా రాహుల్ ముందుకే సాగ‌డం తీవ్ర ఉద్రిక్త‌తకు దారి తీసింది. అయ‌న్ను అడ్డుకునే క్ర‌మంలో పోలీసులకు రాహుల్ మద్దతుదారులకు మధ్య తోపులాట జ‌రిగింది. ఈ గంద‌ర‌గోళంలో రాహుల్ గాంధీ కింద‌ప‌డిపోయారు. ఆ త‌ర్వాత అయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే తన పట్ల యూపీ పోలీసులు వ్య‌వ‌హ‌రించి తీరును రాహుల్ తీవ్రంగా ఖండించారు‌. త‌న‌ను నెట్టివేశార‌ని.. లాఠీచార్జ్ కూడా చేశార‌ని అయన మండిప‌డ్డారు. త‌న‌ను తోసివేసి కింద ప‌డేసిన‌ట్లు రాహుల్ ఆరోపించారు. అయితే హ‌త్రాస్ తానొక్క‌డినే వెళ్లాల‌ని అనుకుంటున్నాని.. తనను ఏ సెక్ష‌న్ కింద అరెస్ట్ చేస్తున్నార‌ని ఆయ‌న ‌ప్ర‌శ్నించారు. అయితే రాహుల్ గాంధీ నిబంధ‌న‌లను అతిక్ర‌మించింనందుకుగాను ఐపీసీ 188 సెక్ష‌న్ కింద అరెస్ట్ చేస్తున్న‌ట్టు పోలీసులు చెప్పారు. దీంతో యూపీ ప్ర‌భుత్వం తీరుపై రాహుల్ తీవ్రంగా మండిప‌డ్డారు. ప్ర‌ధాని మోదీ మాత్ర‌మే ఈ దేశంలో న‌డుస్తారా.. ఓ సాధార‌ణ వ్య‌క్తి క‌నీసం న‌డ‌వ‌లేరా అని ఆయ‌న నిలదీశారు. ఈ ఘర్షణలో కిందపడిన అన్నను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. తనను కూడా పోలీసులు నెట్టివేశారంటూ ఆమె ఆరోపించారు.