English | Telugu

హత్రాస్ వెళ్లేందుకు రాహుల్‌, ప్రియాంకకు అనుమతి

హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎట్టకేలకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీకి అనుమతి లభించింది. అయితే వీరితో పాటు మరో ముగ్గురికి మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు. హత్రాస్ లో 144 సెక్షన్ అమలులో ఉందని, అందుకే ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చామని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం రాహుల్‌, ప్రియాంక నొయిడా టోల్‌ ప్లాజా వద్దకు చేరుకున్నారు. ప్రియాంక వాహనాన్ని నడుపుతున్నారు. మరోవైపు రాహుల్, ప్రియాంక బయల్దేరిన నేపథ్యంలో వారి వెంట కార్యకర్తలు కూడా తరలివచ్చారు. అయితే కార్యకర్తలందర్నీ ఢిల్లీ టోల్‌ గేట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాగా, మొన్న రాహుల్ గాంధీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున హత్రాస్ వెళ్లేందుకు ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. కానీ, 144 సెక్షన్ ఉండటంతో పోలీసులు అనుమతించలేదు. పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో రాహుల్ కింద కూడా పడ్డారు. దీంతో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్ మరోసారి హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు సిద్దమయ్యారు. అంతేకాదు, బాధితులను పరామర్శించి తీరుతామని, తమను ఏ శక్తి అడ్డుకోలేదని రాహుల్ ట్వీట్ చేసి మరీ బయలుదేరారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. రాహుల్, ప్రియాంకతో పాటుగా మరో ముగ్గురిని హత్రాస్ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారని సమాచారం.

మరోవైపు, హత్రాస్ ఘటన వెలుగుచూసిన ఐదు రోజుల తర్వాత శనివారం అక్కడికి మీడియాను కూడా అనుమతించిన సంగతి తెలిసిందే.