English | Telugu

రిటైరవుతున్నానంటూ షాక్ ఇచ్చిన పీవీ సింధు! అసలు ట్విస్ట్ ఇది!

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఒక్కసారిగా షాకిచ్చారు. తాను రిటైరవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరూ అవాక్కయ్యేలా చేశారు. అయితే ఆమె పెట్టిన పోస్టును మొత్తం చదివితే అసలు ట్విస్ట్ తెలిసింది. ఆమె రిటైరవుతున్నది క్రీడ నుంచి కాదని, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణం నుంచని అర్ధమవుతుంది. తన లేఖ మొత్తం చదివితే తాను తీసుకున్న నిర్ణయం సబబేనని అందరూ అంగీకరిస్తారని సింధు తన ప్రకటనలో తెలిపింది. సింధూ తన అభిప్రాయాన్ని పోస్టులో తెలిపినా.. దాన్ని మొత్తం చదవని వారు మాత్రం గందరగోళానికి గురయ్యారు.

పీవీ సింధు చేసిన పోస్టులో ఇలా ఉంది. "ఈ లేఖ మొదట్లో మీరు షాక్ అవుతారు, అయోమయానికి గురవుతారు. లేఖ పూర్తిగా చదివిన పిమ్మట మీరు కూడా నాతో అంగీకరిస్తారనుకుంటున్నా. ఈ కరోనా మహమ్మారి నాకో కనువిప్పు. కఠినమైన ప్రత్యర్థులను ఓడించేందుకు కఠోరంగా సాధన చేయొచ్చు. మ్యాచ్ లో చివరి షాట్ వరకు హోరాహోరీగా పోరాడవచ్చు. గతంలో నేను ఇలా చేశాను కూడా. కానీ ప్రపంచాన్నంతటినీ కట్టిపడేస్తున్న ఈ కంటికి కనిపించని వైరస్ మహమ్మారితో పోరాడడం ఎలా?

నెలల తరబడి ఇంట్లోనే ఉన్నాం, బయటికి వచ్చే ప్రతిసారి భయపడాల్సిన పరిస్థితి! కరోనా పరిస్థితుల నేపథ్యంలో హృదయాలు ద్రవించే గాథలు వింటున్నాం. అయితే నేను ప్రస్తుతం నెలకొని ఉన్న అనిశ్చితి నుంచి రిటైరవ్వాలని భావిస్తున్నా. ఈ ప్రతికూల వాతావరణం నుంచి రిటైరవుతున్నా. వదలక వెంటాడుతున్న భయం, సందిగ్ధత నుంచి రిటైర్ అవుతున్నా. ముఖ్యంగా, మన నాసిరకం పరిశుభ్రతా ప్రమాణాల నుంచి రిటైర్ అవుతున్నా, వైరస్ అంటే ఏముందిలే అనే నిర్లక్ష్య ధోరణి నుంచి రిటైర్ అవుతున్నా.. నికార్సయిన పోరాటం లేకుండా మ్యాచ్ ను అప్పగించడం నాకు తెలియదు. ఇప్పుడు కరోనా విషయంలోనూ అంతే. ఇదే పోరాటాన్ని నేను, మనం సురక్షితమైన ప్రపంచం సాకారమయ్యేదాకా కొనసాగిద్దాం" అంటూ సింధు సుదీర్ఘ ప్రకటన చేసింది.