English | Telugu

ట్రంప్ కు కోర్టులోనూ చుక్కెదురు.. ఓటమి తప్పదా..! 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయి ఓట్లు లెక్కింపు కొనసా.... గుతున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు తరువాత జార్జియా, మిచిగన్ రాష్ట్రాల ఫలితాలను ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టులో సవాల్ చేయగా చుక్కెదురైంది. ఈ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ తొలి దశలలో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా, తరువాత అనూహ్యంగా బైడెన్ పుంజుకుని లీడింగ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా జార్జియా విషయంలో 53 బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రానికి ఆలస్యంగా వస్తే, వాటిని కూడా కలిపివేశారని ఆరోపిస్తూ, ట్రంప్ టీమ్ కోర్టును ఆశ్రయించింది. ఇటు మిచిగన్ లో కూడా ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని ట్రంప్ టీం డిమాండ్ చేసింది. అయితే ఈ రెండు రాష్ట్రాల న్యాయమూర్తులూ ట్రంప్ పిటిషన్లను తోసిపుచ్చారు.

జార్జియా సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ బాస్, ట్రంప్ అభ్యర్ధనను తోసిపుచ్చుతూ.. బ్యాలెట్లు చెల్లవని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలూ లభించలేదని వ్యాఖ్యానించారు. ఇక మిచిగన్ కేసులో న్యాయమూర్తి సింథియా స్టీఫెన్స్ అయితే అసలు కేసును విచారించాల్సిన ఆవశ్యకత ఉన్నట్టు భావించడం లేదని పేర్కొన్నారు.

మిచిగన్, జార్జియా కోర్టు తాజా తీర్పులపై ట్రంప్ ప్రతినిధులు ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. నెవెడాలో బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉండగా, మిచిగన్ లో బైడెన్ విజయం ఖాయమైంది. జార్జియాలో మాత్రం ప్రస్తుతానికి ట్రంప్ అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. నెవెడాలో చెల్లని ఓట్లను లెక్కించి, వాటిని బైడెన్ ఖాతాలో కలిపారని, అంతేకాకుండా కరోనా కాలంలో క్లార్క్ కౌంటీని విడిచి వెళ్లిపోయిన వేలాది మంది ఓట్లను తీసుకొచ్చి కలిపారని తమకు అనుమానాలు ఉన్నాయని ట్రంప్ టీమ్ సభ్యుడు, నెవడా మాజీ అటార్నీ జనరల్ అడామ్ లక్సలత్ ఆరోపించారు. ఈ విషయంలో మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు తాము సైద్దమౌతున్నామని తెలిపారు.