జనసేన నేత పవన్ కళ్యాణ్ సోమవారం గుడివాడ పర్యటన సందర్భంగా మంత్రి కొడాలి నాని పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మంత్రి కొడాలి నాని జనసేన అధినేత విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో మంగళవారం జరిగిన పేదలకు ఇల్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవనే పెద్ద బోడి లింగమంటూ విరుచుకుపడ్డారు. తామంతా శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారని అయన వ్యాఖ్యానించారు. పవన్ ఒక పెద్ద బోడిలింగం కాబట్టే అటు గాజువాక, ఇటు భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని విమర్శించారు. ప్యాకేజీలు తీసుకొని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్లను ప్రజలు నమ్మరన్నారు. ప్రజల తిరస్కారానికి గురైన పవన్ సిగ్గు, శరం లేకుండా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమని నాని విమర్శించారు. విజయవాడ నగరంలోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో.. పేకాట క్లబ్ లు నిర్వహించిన చరిత్ర చంద్రబాబు, అతని పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ది అంటూ నాని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అలాగే గుడివాడ లో పేకాట క్లబ్ లను మూయించిన చరిత్ర సీఎం జగన్ ది, తనది అని అయన అన్నారు. అసలు పవన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టమన్నారు. ప్యాకేజీలు తీసుకొని మాట్లాడే పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని నాని హెచ్చరించారు. పవన్ వకీల్ సాబ్ కాదు...షకీలా సాబ్ అని జనాలు అనుకుంటున్నారని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ను సినిమాలు మానేయమని ఎవరూ చెప్పలేదు, ఆయన సినిమాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా ఒకటే అని నాని పేర్కొన్నారు. గజదొంగ లాంటి చంద్రబాబు, బోడి లింగం లాంటి పవన్ కల్యాణ్లు ఎంతమంది వచ్చినా, దేవుడు ఆశీస్సులు ఉన్నంత కాలం సీఎం జగన్ బొచ్చు కూడా పీకలేరంటూ కొడాలి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.