English | Telugu
108, 104 ఉద్యోగులకు సీఎం వై.యస్ జగన్ తీపి కబురు...
Updated : Nov 1, 2019
వైద్య ఆరోగ్య రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి దేశం మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచిన 108, 104 వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో ఆయా వాహనాల్లో పని చేసే ఉద్యోగులకు వైయస్ జగన్ ప్రభుత్వం వరం అందించనుంది. పాదయాత్రల్లో వారి కష్టాలను తెలుసుకున్న వైయస్ జగన్ వాటిని పూర్తిగా రూపుమాపేందుకు సమాయత్తమవుతున్నారు. అత్యవసర సమయాల్లో అపర సంజీవనిగా నిలిచిన 108 వాహనాల నిర్వహణ ఉద్యోగుల కష్టాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి వాటికి ఇంధనం కూడా లేక మూలన పడేస్తున్న సందర్భాలూ అనేకం.
మరోవైపు రిపేర్ లు వస్తే ఇక షెడ్డుకే, అవసరానికి తగ్గట్టు వాహనాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. పిలిచిన అరగంటకు కూడా వాహనాలు రాని పరిస్థితి, ఈ దుస్థితిని ఉద్యోగులు పలుమార్లు పాద యాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వివరించారు. రాజన్న స్వప్నంగా నిలిచిన ఈ వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ చర్యలు చేపట్టారు. ఈ వాహనాల్లో పని చేసే టెక్నిషియన్ కు 30,000 జీతాన్ని నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు వాహన పైలెట్ కు కూడా 28,000 జీతాన్ని ప్రకటించారు. కావలిసినన్ని వాహనాలతో పాటు వాటి నిర్వహణలో లోటు లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు 104 వాహనాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మరిన్ని వాహనాలను కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు చర్యలు చేపట్టింది. దీని కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ తరుణంలో జీతభత్యాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో పని చేసే ఏ.ఎన్.ఎం, ల్యాబ్ టెక్నీషియన్, పారా మెడికల్ సిబ్బందికి 28,000 జీతాన్ని నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్యుల సర్వీసు రాబోయే వైద్యుల నియామకంలో వెయిటేజ్ ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చినందుకు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాద యాత్రలో ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సీ.ఎం వై.యస్ జగన్ పూనుకోవడం హర్షణీయమని ఉద్యోగులంటున్నారు. మొత్తం మీద అత్యవసర సేవలకు సంజీవ వనాలనిచ్చిన 108, 104 ఉద్యోగులకు సీఎం వై.యస్ జగన్ తీపి కబురు చెప్పారు.