English | Telugu

వైరస్‌ ఎలా సోకింది? తేలని లింకులు!

జిహెచ్ ఎంసి ప‌రిధిలోని నేరేడ్‌మెట్‌, హెచ్‌బీకాలనీ, అమీర్‌పేట, యాచారం, నల్లకుంట ప్రాంతాల్లో క‌రోనా ఎలా పాకింది. దీనికి సంబంధించిన లింకులు ఇంకా అంతు ప‌ట్ట‌లేదు. తాజాగా కేసుల లింకులు గుర్తించేందుకు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది శ్రమిస్తున్నారు. కొన్ని కేసుల్లో వైరస్‌ ఎలా సోకిందో అర్థం కావడం లేదు. మరోవైపు ఆదివారం ఛాతీ ఆసుపత్రిలో 9 మంది, ఫీవరాసుపత్రిలో ఇద్దరు అనుమానిత లక్షణాలతో చేరారు.

గ్రేటర్‌ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కాస్త తగ్గినట్లు కనిపించినా.. కొత్తగా నమోదవుతున్న కేసుల విషయంలో లింకులు తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓల్డ్‌ నేరేడ్‌మెట్‌లో ఓ వ్యక్తి(32)కి ఆదివారం కరోనా పాజిటివ్‌ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అతని కుటుంబంలోని తల్లి, భార్య, కుమారుడు(19నెలలు), ఒక అక్క..మొత్తం ఆరుగురిని హోం క్వారంటైన్‌ చేశారు.

కూకట్‌పల్లిలోని ఓ సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న వ్యక్తి జలుబు, దగ్గుతో 24న కింగ్‌ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంటికే పరిమితమైన అతనికి వైరస్‌ ఎలా సోకిందని అధికారులు ఆరా తీస్తున్నారు.

మీర్‌పేట్‌ హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌ పరిధిలోని వ్యక్తి(46) మృతి చెందగా ఆ కుటుంబంలోని అయిదుగురికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో ఏడాది చిన్నారి కూడా ఉన్నాడు. వైరస్‌ ఎలా సోకిందని అధికారులు ఆరా తీస్తున్నారు.

హైద‌రాబాద్ ప‌రిధిలో ఆదివారం కొత్త‌గా 11 కేసులు నిర్ధారణ అయ్యాయి. జిహెచ్ ఎంసి ప‌రిధిలో మొత్తం 691 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇందులో 151 డిశ్ఛార్జి అయ్యారు. 18 మంది మృతువాత ప‌డ్డారు.