English | Telugu

అనంతపురం కోవిడ్ హాస్పిటల్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం...

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాద దుర్ఘటన మరిచిపోక ముందే తాజాగా అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ హాస్పిటల్ కొవిడ్ వార్డులోని రికార్డు రూములో 12 గంటల సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ గది పక్కనే 24 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రి వద్దకు చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అగ్నిప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, ఎస్పీ సత్య ఏసుబాబు, స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే కరోనా బాధితులను మరో వార్డుకు తరలించారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. ఈ ఘటన పై ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.