English | Telugu

జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అనంతపురం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ప్రభాకర్‌ రెడ్డి కడప జైల్లో ఉన్నారు. జైల్లో ఉండగా ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా సోకిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలై ఇంటికొస్తుండగా కోవిడ్ నిబంధనల మేరకు వాహనాలకి ఓ పోలీస్ అధికారి అనుమతి ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో ప్రభాకర్‌రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను మళ్లీ రిమాండుకు కడప జైలుకు తరలించారు. జైల్లో ఉండగా ఆయనకు కరోనా సోకింది. ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. దీంతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.