English | Telugu

రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు..!

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయనున్నారని రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తున్నట్లుగా వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ హైకోర్టు ప్రస్తుత సీజే జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేసి అక్కడ హైకోర్టు సీజే గా ఉన్నసీజే గా ఉన్న జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలనీ సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసినట్లు సమాచారం. మరో పక్క తెలంగాణ సీజే గా ఉన్న జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌ చీఫ్‌ జస్టిస్ గా నియమించాలని అయన స్థానంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్‌ హిమా కోహ్లీని నియమించాలని సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. సుప్రీం కొలీజియం తాజా సిఫారసుల్లో ఇవి కీలకమైనవికాగా... మరిన్ని అంశాలు ఇంకా తెలియరాలేదు. ఈ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ బదిలీలు ఖరారు అవుతాయి. వచ్చే సంక్రాంతి తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు దేశవ్యాప్తంగా మరో ఐదారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి

ఏపీ హైకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్ గా నియమించాలని కొలీజియం సిఫారసు చేసిన జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి 1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్ లో జన్మించారు. అయన గౌహతి యునివర్సిటీ పరిధిలోని కాటన్‌ కాలేజీ నుంచి 1981లో ఎకనామిక్స్‌ లో డిగ్రీ చేశారు. 1985లో గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం ఆగస్టు 16న ఈశాన్య రాష్ట్రాల బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకుని సివిల్‌, క్రిమినల్‌, రాజ్యాంగ, సర్వీస్ కు సంబంధించిన కేసులలో వాదనలు వినిపించారు. 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 2011 జనవరి 24న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 నవంబరు 7న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ గోస్వామి 2 విడతల్లో కొంతకాలం గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2019 అక్టోబరు 15 నుంచి సిక్కిం హైకోర్టు సీజేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి ఏపీ, తెలంగాణ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా సీజే..

మరోపక్క కొలీజియం సిఫారసులను రాష్ట్రపతి కనుక ఆమోదిస్తే.. ఉమ్మడి ఏపీ హైకోర్టుతోపాటు, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ రికార్డు నెలకొల్పుతారు. 1959 సెప్టెంబరు 2న ఢిల్లీలో జన్మించిన జస్టిస్‌ హిమా కోహ్లీ.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎంఏ(హిస్టరీ) చదివిన అనంతరం న్యాయశాస్త్రం చదివి.. 1984లో లా డిగ్రీ పొందారు. అదే సంవత్సరం ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1999-2004 మధ్య కాలంలో ఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌కు హైకోర్టులో స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. 2004లో ఢిల్లీ ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌ (సివిల్‌) గా విధులు నిర్వర్తించారు. పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కమిషన్‌, ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ కమిటీ, నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌లతోపాటు పలు బ్యాంకులకు, ప్రైవేటు సంస్థలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై.. 2007 ఆగస్టు 29న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మే 20 నుంచి ఢిల్లీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా, ఈ ఏడాది జూన్‌ 30 నుంచి నేషనల్‌ లా యూనివర్సిటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.