English | Telugu
రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు..!
Updated : Dec 16, 2020
ఏపీ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ గా నియమించాలని కొలీజియం సిఫారసు చేసిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి 1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్ లో జన్మించారు. అయన గౌహతి యునివర్సిటీ పరిధిలోని కాటన్ కాలేజీ నుంచి 1981లో ఎకనామిక్స్ లో డిగ్రీ చేశారు. 1985లో గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం ఆగస్టు 16న ఈశాన్య రాష్ట్రాల బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకుని సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, సర్వీస్ కు సంబంధించిన కేసులలో వాదనలు వినిపించారు. 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 2011 జనవరి 24న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 నవంబరు 7న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ గోస్వామి 2 విడతల్లో కొంతకాలం గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2019 అక్టోబరు 15 నుంచి సిక్కిం హైకోర్టు సీజేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఏపీ, తెలంగాణ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా సీజే..
మరోపక్క కొలీజియం సిఫారసులను రాష్ట్రపతి కనుక ఆమోదిస్తే.. ఉమ్మడి ఏపీ హైకోర్టుతోపాటు, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ రికార్డు నెలకొల్పుతారు. 1959 సెప్టెంబరు 2న ఢిల్లీలో జన్మించిన జస్టిస్ హిమా కోహ్లీ.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎంఏ(హిస్టరీ) చదివిన అనంతరం న్యాయశాస్త్రం చదివి.. 1984లో లా డిగ్రీ పొందారు. అదే సంవత్సరం ఢిల్లీ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. 1999-2004 మధ్య కాలంలో ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్కు హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా, న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. 2004లో ఢిల్లీ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ (సివిల్) గా విధులు నిర్వర్తించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కమిషన్, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్లతోపాటు పలు బ్యాంకులకు, ప్రైవేటు సంస్థలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై.. 2007 ఆగస్టు 29న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మే 20 నుంచి ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, ఈ ఏడాది జూన్ 30 నుంచి నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.