English | Telugu

అక్కడ ఊరందరికీ కరోనా.. కానీ ఒకే ఒక్కడు క్వారంటైన్ లో..

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్ని రోజుల క్రితం వైరస్ వ్యాప్తి కొంత తగ్గినట్టుగా కనిపించినా మళ్ళీ శీతాకాలం మంచు కారణంగా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా సోకిన వారు వీలయితే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తెస్కుకుంటున్నారు లేదంటే హాస్పిటల్ లో జాయిన్ అవుతున్నారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని జన్‌జాతీయ జిల్లా లాహౌల్-స్పీతి లోని థొరాంగ్ గ్రామంలో భూషన్ ఠాకుర్ అనే ఒక వ్యక్తికి మినహా మిగిలిన 42 మందికి కరోనా సోకింది. అయితే భూషన్ కుటుంబంలో కూడా అతను మినహా అతని భార్యతో పాటు కుటుంబంలోని ఆరుగురికి కూడా కరోనా సోకింది. దీంతో గ్రామం మొత్తంలో కరోనా సోకని వ్యక్తిగా భూషన్ ఠాకుర్ ఒక్కరే నిలిచారు. కరోనా సోకకుండా ఉండేందుకు తాను తగిన జాగ్రత్తలు తీసుకున్నందునే వ్యాధి బారిన పడలేదని అయన తెలిపారు. ఈ విషయం పై లాహౌల్- స్పీతికి చెందిన డాక్టర్ పల్జోర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన భూషన్ లో రోగ నిరోధక శక్తి సమర్థవంతంగా పనిచేస్తున్నదన్నారు.

మొత్తం గ్రామంలోని అందరికీ కరోనా పాజిటివ్ వచ్చినా, భూషన్‌కు మాత్రం నెగిటివ్ రావడం చాల మందికి విచిత్రంగా అనిపించిందన్నారు. మొదట్లో గ్రామానికి చెందిన ఐదుగురు కరోనా పాజిటివ్ ‌గా తేలారని, దీంతో గ్రామంలోని వారంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకున్నారన్నారు. ఈ గ్రామంలో మొత్తం జనాభా 100 మంది కాగా.. ప్రస్తుతం అక్కడ మంచు కురుస్తున్న కారణంగా కొంతమంది కూలూ ప్రాంతానికి తరలి వెళ్లిపోయారని అన్నారు. ఇది ఇలా ఉండగా కరోనా సోకని భూషన్ తన ఇంటిలోని వారికి దూరంగా ఒక గదిలో ఒక్కడే ఉంటూ.. స్వయంగా వంట వండుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు భూషన్ కూడా కరోనా టెస్టు చేయించుకోగా.. అతనికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కరోనాను ఎంత మాత్రం తేలికగా తీసుకోవద్దని, మాస్క్ ధరించడంతో పాటు శానిటైజ్ చేసుకోవడం మరచిపోకూడదని ఈ సందర్భంగా భూషన్ స్పష్టం చేస్తున్నాడు.