English | Telugu

ఫైజర్ వ్యాక్సిన్ తో బయటపడుతున్న కొత్త సైడ్ ఎఫెక్ట్ లు.. పునరాలోచనలో అమెరికా 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పై పోరాడేందుకు సామాన్య జనం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ ఒక పెద్ద ఆశాకిరణముగా కనిపించింది. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటిగా నెమ్మదిగా తెరపైకి రావడంతో జనంలో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి సంబంధించి యూఎస్ ఎఫ్‌డీఏ ఒక సంచలన విషయం బయటపెట్టింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న నలుగురు వాలంటీర్లు ముఖానికి సంబంధించిన తాత్కాలిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం అధికారులు ఎఫ్‌డీఏను కలిసినప్పుడు ట్రయల్స్ సమయంలో తలెత్తిన ఈ అనారోగ్య సమస్యను బయటపెట్టింది. వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఇలా నలుగురు వాలంటీర్లు తాత్కాలిక ముఖ పక్షవాతానికి గురైనట్లు తెలిపింది. అయితే ఇదే ట్రయల్స్ లో పాల్గొన్న మిగతా సభ్యులలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని అధికారులు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వల్ల ఏర్పడిన ఈ సమస్యపై మరింత విస్తృతంగా పరిశోధన చేయాలనీ ఈ సందర్భంగా ఎఫ్‌డీఏ పేర్కొంది. దీంతో ఈ వ్యాక్సిన్‌పై ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న అమెరికన్లకు తీవ్ర నిరాశ ఎదురైనట్లైంది.

ప్రపంచంలో ఏదైనా ఒక వ్యాక్సిన్ ట్రయల్స్ దశలో కొన్ని స్వల్ప సైడ్ ఎఫెక్ట్ లను చూపించడం సాధారణం. అలాగే ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న మొత్తం వాలంటీర్లలో 84 శాతం మంది ఏదో ఒక రియాక్షన్‌కు గురైనట్లు సమాచారం. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా టీకా తీసుకున్న తర్వాత 63 శాతం మందికి అలసట, ఆయాసం వస్తే.. 55 శాతం మంది తలనొప్పి వచ్చినట్లు తెలియజేశారు. అలాగే ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 32 శాతం మంది చలి వేసిందని, 24 శాతం మందికి కీళ్లనొప్పులు, మరో 14 శాతం మంది జ్వరంతో బాధపడ్డారని సమాచారం. అయితే కొన్ని స్వల్ప సైడ్ ఎఫెక్ట్ లు తప్పిస్తే ఇతర సమస్యలేమీ లేకపోవడంతో ఎఫ్‌డీఏ నుంచి ఫైజర్ వ్యాక్సిన్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ, తాజాగా మూడో దశ ట్రయల్స్‌లో నలుగురు వాలంటీర్లు అస్వస్థకు (ముఖ పక్షవాతం) గురికావడంతో ఎఫ్‌డీఏ ఈ వ్యాక్సిన్ విషయమై పునరాలోచనలో పడిందని సమాచారం.

ఇక మరో ప్రక్క ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్రిటన్ లో మంగళవారం నుండి ఫైజర్ వ్యాక్సిన్ ను ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే, అక్కడ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి. అలెర్జీ ఉన్న వ్యక్తులపై ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావాన్ని చూపిస్తున్నట్లు యూకే రెగ్యులేర్స్ సంస్థ పేర్కొంది. దీంతో అలెర్జీ ఉన్న వ్యక్తులు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవద్దని హెచ్చరించింది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యాక్సిన్ 90 శాతం సత్ఫలితాలనిచ్చినట్లు పరిశోధకులు వెల్లడించడంతో కరోనా మహమ్మారికి మందు లభించినట్లేనని అందరూ సంతోషిస్తున్న సమయంలో ఇప్పుడు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ప్రజలలో తీవ్ర ఆందోళన రేపుతోంది.