English | Telugu
దేశ రాజధాని పాలకుడిని నిర్ణయించటానికి సమాయత్తమవుతున్న ఓటర్లు...
Updated : Feb 7, 2020
ఢిల్లీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ప్రచార హోరు ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. రేపు ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనేందుకు వీలుగా అనేక సంస్థలు ఆఫర్ లు ప్రకటిస్తున్నాయి. మరోవైపు ప్రచారం చివరి రోజు నిర్వహించిన ఓపెన్ పోల్స్ కూడా అధికారం ఆప్ దేనని స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు దేశ రాజధానిని పాలించేది ఎవరో నిర్ణయించేందుకు ఢిల్లీ ఓటర్లు సమాయత్తమవుతున్నారు. నిన్నటివరకు అన్ని పార్టీల ప్రచారాన్ని హామీలనూ ఓపిగ్గా విన్న సగటు ఢిల్లీ ఓటర్లు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు రెడీ అయ్యారు. రేపు జరిగే పోలింగ్ లో మొత్తం కోటి నలభై ఏడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఢిల్లీ రాష్ట్ర పరిధిలో మొత్తం పదమూడు వేల ఏడు వందల యాభై పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ సీ కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. నూట తొంభై కంపెనీలకు చెందిన సెంట్రల్ పారామిలిటరీ బలగాలను ఈ సారి భద్రత కోసం వినియోగిస్తున్నారు.
రెండు వేల పంతొమ్మిది లోకసభ ఎన్నికల్లో ఢిల్లీలో మోహరించిన బలగాల సంఖ్య కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనేందుకు వీలుగా కొన్ని సంస్థలు ఆఫర్ లు ప్రకటించాయి. ఢిల్లీలో ఓటు హక్కు ఉండి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారికి స్పైస్ జెట్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. స్పైస్ డెమోక్రసీ పేరుతో ఉచిత ప్రయాణ టికెట్ లను జారీ చేస్తోంది. ముందుగా నమోదు చేసుకున్న వాళ్లకు బేస్ పేరును రద్దు చేస్తారు, కేవలం పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. మరోవైపు ఓటర్ల సౌకర్యం కోసం ఢిల్లీ మెట్రో రైల్ గంటన్నర ముందు నుంచే సర్వీసులు ప్రారంభిస్తోంది. ఉదయం నాలుగు గంటల నుంచే ఢిల్లీలో మెట్రో సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నా ఒపీనియన్ పోల్స్ సర్వేలు మాత్రం మరోసారి ఆప్ దే అధికారం అంటున్నాయి. జనవరి ఆరు నుంచి నిన్నటి వరకు ఆరుసార్లు వివిధ సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అన్నింటిదీ ఒకటే మాట ఆమ్ ఆద్మీ పార్టీ నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు కైవసం చేసుకుంటుందన్నది ఓపీనియన్ పోల్స్ సారాంశం.
ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా, బస్తీవాసులకు నాణ్యమైన వైద్యం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ఇలాంటి మధ్యతరగతిని ప్రభావితం చేసే అనేక పథకాలను అమలు చేస్తున్న కేజ్రీవాల్ కు ఢిల్లీ ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తారు అంటున్నాయి సర్వేలు. 2015 ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకు మాత్రమే పరిమితమైన బిజెపి ఈ సారి ఢిల్లీలో అధికారం కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో బీజేపీకి ఇవి అగ్నిపరీక్ష అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్ లో కొనసాగుతున్న ఆందోళనలు కూడా ఈ సారి ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించబోతున్నాయి. గత ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది కూడా చూడాలి.