English | Telugu

టాప్ ఉగ్రవాదుల లిస్టులో హైదరాబాదీ

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన 18 మంది మెస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హైదరాబాదీ కూడా ఉన్నారు. ఓల్ట్ సిటీ మాదన్నపేట సమీపంలోని కుర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ పేరును కేంద్రం కరుడుగట్టిన ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతను రెండు దశాబ్దాలుగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఫర్హతుల్లా ఘోరీ అలియాస్‌ అబు సూఫియాన్‌ 1998లోనే ఉగ్రవాదం వైపు అడుగేశాడు. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌(జేఈఎం) సానుభూతిపరుడిగా మారి భావసారూప్యం ఉన్న యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడం ప్రారంభించాడు. తొలుత దుబాయ్‌ పారిపోయి అక్కడ నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టి అనంతరం పోలీసు ఒత్తిడి పెరగడంతో పాకిస్థాన్‌ చేరుకున్నాడు. ప్రస్తుతం అక్కడ నుంచే పనిచేస్తున్నాడు.

గుజరాత్‌లోని అక్షరధామ్‌ ఆలయంపై 2002లో జరిగిన దాడితో అతడి పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. 2004లో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర పన్నినప్పటికీ పోలీసులు ఛేదించారు. 2005లో హైదరాబాద్ గ్రీన్‌ల్యాండ్స్ సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడిలోనూ ఘోరీ నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటనలో హోంగార్డు చనిపోయాడు. ప్రస్తుతం లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)లో పనిచేస్తున్న ఫర్హతుల్లా ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుల్లో ఒకడైన అమీర్ రాజాకు అత్యంత సన్నిహితుడు. దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనల్లో ఇతడి పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఇక కేంద్రం ప్రకటించిన 18 మంది ఉగ్రవాదుల జాబితాలో లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులైన కర్ణాటకకు చెందిన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో యాసిన్ భత్కల్‌కు ప్రత్యేక కోర్టు ఇప్పటికే ఉరిశిక్ష విధించింది. కర్ణాటకకు చెందిన ఈ ముగ్గురూ దేశంలో అనేక పేలుళ్లకు సూత్రధారులు.