Read more!

English | Telugu

ప్రభాస్ 'కల్కి'లో బిగ్ సర్ ప్రైజ్.. కృపాచార్యుడి పాత్రలో తెలుగు స్టార్..!

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ లెవెల్ లో సంచలనాలు సృష్టించగల తెలుగు సినిమా అని అందరూ బలంగా నమ్ముతున్నది 'కల్కి 2898 AD'. ప్రభాస్ హీరోగా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటితో పాటు దర్శకుడు రాజమౌళి అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఈ లిస్టులో మరో తెలుగు స్టార్ చేరినట్లు తెలుస్తోంది.

'కల్కి'లో నేచురల్ స్టార్ నాని ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని కృపాచార్యుడిగా కనిపించనున్నాడని సమాచారం. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువుగా.. సప్త చిరంజీవులలో ఒకటిగా కృపాచార్యుడుకి ఎంతో విశిష్టత ఉంది. అలాంటి పాత్రలో నాని కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

దర్శకుడు నాగ్ అశ్విన్ తో నానికి మంచి అనుబంధం ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో నానినే హీరో. ఆ అనుబంధంతోనే సినిమాకి కీలకమైన కృపాచార్యుడు పాత్రలో నటించాలని నానిని కోరాడట నాగ్ అశ్విన్. దిగ్గజ నటులతో నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న భారీ సినిమా కావడంతో పాటు, తనది కీలకమైన కృపాచార్యుడి పాత్ర కావడంతో నాని వెంటనే అంగీకరించాడట. సినిమాలో ఈ పాత్ర బిగ్ సర్ ప్రైజ్ లా ఉంటుందని సమాచారం.

కాగా 'కల్కి'లో ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కలి గా కమల్ హాసన్ కనిపించనున్నారు. కృపాచార్యుడిగా నాని కనిపించనున్నాడని వినికిడి. ఇక అశ్వత్థామ, కృపాచార్యుడు తో పాటు.. సప్త చిరంజీవులు అయినటువంటి హనుమంతుడు, పరశురాముడు వంటి పాత్రలు కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశముంది అంటున్నారు.