Read more!

English | Telugu

నిర్మాతగా ఎ.ఆర్.రెహమాన్

నిర్మాతగా ఎ.ఆర్.రెహమాన్ మారనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన "రోజా చిత్రంతో సంగీత దర్శకుడిగా మారి అనతి కాలంలోనే జాతీయ స్థాయికి, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికీ ఎదిగి, అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డుని తొలిసారి అందుకున్న భారత సంగీత దర్శకుడిగా పేరుగాంచిన ఎ.ఆర్.రెహమాన్ తొలిసారిగా సినీ నిర్మాతగా మారనున్నారు. ఆయన తొలిసారి నిర్మించబోయే చిత్రం దక్షిణాది భాషలోనే అని తెలిసింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తాను స్థాపిస్తున్న "వై.యమ్.మూవీస్" పతాకంపై తన తొలి చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

 

అయితే రెహమాన్ నిర్మించబోయే ఈ చిత్రానికి దర్శకుడెవరు...?, హీరో,హీరోయిన్లు ఎవరు...? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. బహుశా తనకు తొలిసారి సంగీత దర్శకుడిగా అవకాశమిచ్చిన ప్రముఖ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలోనే ఎ.ఆర్.రెహమాన్ తన తొలి చిత్రాన్ని నిర్మించబోతున్నారని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.