Read more!

English | Telugu

మెగా ఫ్యామిలీ రెండు ముక్కలయినట్లేనా...?

 

ప్రస్తుత పరిస్థితులు చూస్తే మెగాఫ్యామిలీ రెండుగా చీలిపోయినట్లే అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ దూరం అయ్యాడని తెలుస్తుంది. ఎందుకంటే గతకొంత కాలంగా మెగా కుటుంబ సభ్యులతో పవన్ దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న కొత్త సినిమా ముహూర్త కార్యక్రమంలో కూడా మెగా ఫ్యామిలీ సభ్యులతో పవన్ అంతంత మాత్రంగానే మాట్లాడి, వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పవన్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడని తెలిసిన క్షణం నుండి పవన్ తో మెగా కుటుంబ సభ్యులు పూర్తిగా మాటలు మానేసినట్లుగా తెలిసింది.

ఇవన్నీ పార్టీ పెట్టకముందు కథ. అయితే ఇపుడు మరో కొత్త కథ మొదలయ్యింది. మెగా బ్రదర్ నాగబాబు పవన్ పై ఊహించని విధంగా సంచలన కామెంట్లు చేసాడు. "మెగా కుటుంబ సభ్యులం, మెగా ఫ్యామిలీ అభిమానులు చిరు వెంటే ఉంటాము. ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే అది వాళ్ళిష్టం. మా పేరు చెప్పుకొని ఎవరేం చేసినా మేము భాధ్యులం కాబోము. నేను, అరవింద్, చరణ్, బన్నీ ఇలా మేమందరం కూడా అన్నయ్యతోనే ఉంటాము. ఆయన చూపిన రాజమర్గంలోనే నడుస్తాము" అని తెలిపారు. చరణ్ కూడా చిరంజీవికే మద్దతు తెలిపాడు.

అయితే "పవన్ మంచోడు. నిజాయితీ గలవాడు. సేవాభావం ఉన్న వ్యక్తి.." అంటూ ఎప్పుడూ పవన్ గురించి మునగ చెట్టు ఎక్కించే విధంగా గొప్పలు చెప్పే నాగబాబు ఇలా పవన్ పై కామెంట్లు చేయడానికి గల కారణం ఏంటో తెలియట్లేదు. చిరంజీవి మీడియా ముందుకు రాకుండా తమ్ముడిని ఎందుకు పంపించారు? త్వరలో చిరు, పవన్ లకు మధ్య మాటల యుద్ధం జరగబోతుందా? మరి పవన్ ను అంతగా అభిమానించే నాగబాబు ఎందుకు ఇలాంటి కామెంట్లు చేసాడు? ప్రస్తుతం నాగబాబు మాట్లాడిన తీరు చూస్తే మెగా ఫ్యామిలీ రెండు ముక్కలయిందని అనిపిస్తుంది. మరి నాగబాబు మాటలకూ ఎవరు ఎలా స్పందిస్తారో మరికొద్ది గంటల్లో తెలియనుంది.