English | Telugu
ఊహించని కాంబో.. తమిళ దర్శకుడితో బాలయ్య!
Updated : May 13, 2025
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ-2' చేస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. అనంతరం అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ వంటి దర్శకులతో వర్క్ చేసే అవకాశముందని పలువురు తెలుగు దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ పేరు తెరపైకి వచ్చింది.
డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఇటీవల 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీతో విజయాన్ని అందుకున్నాడు. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్.. అజిత్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇందులో అజిత్ ని చూపించిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో అధిక్ డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ హీరో ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే అధిక్ కన్ను బాలకృష్ణపై పడినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలయ్యను అధిక్ కలిశాడట. అధిక్ చెప్పిన స్టోరీ లైన్ బాలయ్యకు నచ్చినట్లు వినికిడి. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించే అవకాశముంది.
