Read more!

English | Telugu

'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా రష్మిక!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా రానున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయంపై క్లారిటీ లేదు. అక్టోబర్ లేదా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే దానిపై కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న పేరు ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

 

'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా మొదట బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పేరు వినిపించింది. ఆలియా కూడా ఓసారి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చింది. కానీ పెళ్లి కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని టాక్. ఇక అప్పటి నుంచి హీరోయిన్ గా ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆ తర్వాత సాయి పల్లవి, రష్మిక, కృతి శెట్టి, శ్రీలీల, సమంత ఇలా దాదాపు అందరి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా మూవీ టీమ్ రష్మికను ఫైనల్ చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది.

 

 

ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో సౌత్ తో పాటు నార్త్ లోనూ గుర్తింపు ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని భావించిన మూవీ టీమ్ రష్మికకు ఓటేసినట్టు తెలుస్తోంది. రష్మిక గతేడాది అల్లు అర్జున్ కి జోడీగా పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'లో శ్రీవల్లిగా నటించి మెప్పించింది. అలాగే ప్రస్తుతం 'పుష్ప-2'తో పాటు పలు హిందీ, తమిళ్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే 'ఎన్టీఆర్ 30' టీమ్ ఆమెని సంప్రదించగా వెంటనే ఓకే చేసినట్లు టాక్. అదే నిజమైతే తారక్, రష్మిక కలయికలో రాబోతున్న మొదటి సినిమా ఇదే కానుంది.