English | Telugu

27 ఏళ్ల కెరీర్‌లో వై.వి.యస్‌.చౌదరి 9 సినిమాలే చేశారు. కారణం తెలుసా?

27 ఏళ్ల కెరీర్‌లో వై.వి.యస్‌.చౌదరి 9 సినిమాలే చేశారు. కారణం తెలుసా?

(మే 23 వై.వి.యస్.చౌదరి పుట్టినరోజు సందర్భంగా..)

1990వ దశకం నుంచి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన దర్శకులు ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించారు. వారిలో వై.వి.యస్‌.చౌదరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తను చేసే సినిమా కోసం ఎంపిక చేసుకునే కథ, నటీనటులు మిగతా దర్శకులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తను అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేవరకు ఎన్నిరోజులైనా షూట్‌ చేస్తారు. 1998లో చౌదరి డైరెక్ట్‌ చేసిన తొలి సినిమా ‘శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి’ విడుదలైంది. 27 సంవత్సరాల తన కెరీర్‌లో కేవలం 9 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. అతని డైరెక్షన్‌లో వచ్చిన చివరి సినిమా ‘రేయ్‌’ 2015లో విడుదలైంది. తాజాగా నందమూరి జానకిరామ్‌ కుమారుడు ఎన్‌.టి.ఆర్‌.ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాను లాంచ్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. దర్శకుడిగా సుదీర్ఘమైన కెరీర్‌ ఉన్నప్పటికీ ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి కారణం ఏమిటి, చౌదరి చేసిన సినిమాల్లో విజయాల శాతం ఎంత, దర్శకుడుగా ఎందుకు గ్యాప్‌ తీసుకున్నారు వంటి విషయాల గురించి తెలుసుకుందాం. 

1965 మే 23న యలమంచిలి నారాయణరావు, రత్నకుమారి దంపతులకు గుడివాడలో జన్మించారు యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి. చదువులో ఎప్పుడూ ముందుండే చౌదరి 6, 7, 8 తరగతుల్లో పట్టణ స్థాయిలో ప్రథమస్థానం సంపాదించారు. గుడివాడలో ఇంటర్‌ వరకు చదువుకున్న తర్వాత మద్రాస్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరారు. ఎన్‌.టి.రామారావుకి వీరాభిమాని అయిన చౌదరి 9వ తరగతి చదువుతున్నప్పుడే ఎన్టీఆర్‌ అభిమాన సంఘం స్థాపించి దానికి ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. సినిమాల పట్ల చౌదరికి ఉన్న ఆసక్తిని గమనించిన స్నేహితులు సినిమా డైరెక్టర్‌గా రాణిస్తావని చెప్పడంతో చిన్నతనంలోనే డైరెక్టర్‌ అవ్వాలనుకున్నారు. ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే కాలేజీ మానేసి తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని డబ్బింగ్‌ సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన పట్టాభిషేకం చిత్రానికి రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత కృష్ణవంశీ, రామ్‌గోపాల్‌వర్మ వంటి దర్శకుల దగ్గర అసోసియేట్‌గా పనిచేశారు చౌదరి. సినిమాల గురించి చౌదరి విశ్లేషించే తీరు నచ్చడంతో తన సొంత బేనర్‌ గ్రేట్‌ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్‌లో ‘శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసే అవకాశం ఇచ్చారు నాగార్జున. ఈ సినిమా డైరెక్టర్‌గా చౌదరికి చాలా మంచి పేరు తెచ్చింది. 

చౌదరికి రెండో అవకాశం కూడా నాగార్జునే ఇచ్చారు. కామాక్షి మూవీస్‌తో కలిసి ‘సీతారామరాజు’ చిత్రాన్ని నిర్మించారు నాగార్జున. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘యువరాజు’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమా ఏవరేజ్‌ అనిపించుకుంది. ఆ తర్వాత తనే నిర్మాతగా మారి ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించి హరికృష్ణకు నటుడిగా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తర్వాత వరసగా వచ్చిన ‘సీతయ్య’, ‘దేవదాసు’ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. దేవదాసు తర్వాత చౌదరికి హిట్‌ అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత చేసిన ఒక్క మగాడు, సలీమ్‌, నిప్పు, రేయ్‌ చిత్రాలు నిరాశపరిచాయి. ఇందులో నిప్పు చిత్రాన్ని గుణశేఖర్‌ డైరెక్ట్‌ చేయగా, చౌదరి నిర్మాతగా వ్యవహరించారు. 2015 వరకే చౌదరి డైరెక్టర్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. అంటే 17 సంవత్సరా కెరీర్‌లో అతను చేసిన సినిమాలు తొమ్మిదే. దానికి కారణం ప్రతి సినిమా హై బడ్జెట్‌తో ఉండడం, షూటింగ్‌కి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల తక్కువ సినిమాలు చేశారు. తెలుగు ఇండస్ట్రీకి రామ్‌ పోతినేని, ఇలియానా, ఆదిత్య ఓం, అంకిత వంటి నటీనటుల్ని పరిచయం చేసిన ఘనత వై.వి.యస్‌.చౌదరికి దక్కుతుంది. 

చౌదరి వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా చిత్రానికి కో డైరెక్టర్‌గా పనిచేశారు చౌదరి. ఆ సమయంలోనే ఆ చిత్రంలో నటించిన గీతను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సిందూరం చిత్రంలో రవితేజ సరసన, భరత్‌ దర్శకత్వంలో వచ్చిన అయ్యిందా లేదా చిత్రంలో అలీకి జోడీగా నటించారు గీత. వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పారు. వీరికి ఇద్దరు కుమార్తెలు యుక్తా చౌదరి, ఏక్తా చౌదరి.